సత్యరాజ్ నిర్లక్ష్యం...బాహుబలిని ముంచుతుందా..?
on Apr 20, 2017
మాటకు ఉన్న పవర్ సామాన్యమైంది కాదు. మంచి చేయాలన్నా..విధ్వంసం చేయాలన్నా మాటే. అందుకే మాట తూటా కంటే పదునైంది అని మన పెద్దలు అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం కట్టప్ప సారీ మన సత్యరాజ్ అన్న మాట ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర అలజడి రేపుతోంది. దీని వల్ల నష్టపోతే సత్యరాజ్ నష్టపోవాలి కానీ దీని ప్రభావం బాహుబలి మీద పడింది. గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే బాహుబలి-2ని కర్ణాటకలో విడుదల కానివ్వమంటూ కర్ణాటక రక్షా వేదిక హెచ్చరించింది. సుమారు రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా దీనిపై కట్టప్ప స్పందించలేదు.
వివాదం ఎలాగోలా సద్దుమణుగుతుందని భావించిన చిత్రయూనిట్..అది చిలికి చిలికి గాలివానగా మారడం..రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి సత్యరాజ్తో ఫోన్లో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో కన్నడలో మాట్లాడిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు జక్కన్న. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని..దానికి బాహుబలికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఐదేళ్ల నుంచి ఈ సినిమా కోసం ఎంతోమంది సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎంతో శ్రమించారని..ఫలితం అందబోతున్న సమయంలో సినిమా రిలీజ్ను అడ్డుకోవడం సరికాదని కోరారు. బాహుబలి మొదటి భాగాన్ని ఆదరించినట్లే..రెండో భాగాన్ని కూడా సూపర్హిట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మరి దీనిని కన్నడిగులు అర్థం చేసుకుంటారా..లేక సత్యరాజ్ బెట్టు వీడతారా అన్నది అతి త్వరలోనే తేలిపోనుంది.
Also Read