సత్యరాజ్కే సంబంధం..బాహుబలికి ఎలాంటి సంబంధం లేదు
on Apr 20, 2017
బాహుబలి -2 కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేసేందుకు అన్నీ పనులను దగ్గరుండి పరుగులు పెట్టిస్తున్నాడు జక్కన్న. సినిమా బాగా వచ్చిందని..తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. బాహుబలి బిగినింగ్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి కలెక్షన్లు కొల్లగొట్టాడు రాజమౌళి..ఇప్పుడు కన్క్లూజన్ విషయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేయాలని చూసి లాభాలు దక్కించుకోవాలని చూస్తోంది చిత్రయూనిట్. అయితే కర్ణాటకలో మాత్రం బాహుబలి-2 రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కావేరి నదీ జలాల విషయంలో కట్టప్ప చేసిన వ్యాఖ్యలు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించాయి. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెబితే గానీ బాహుబలిని కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని కన్నడ సంఘాలు పట్టుబడుతున్నాయి.
ఈ విషయంలో అటు కట్టప్ప కానీ..కన్నడ ప్రజా సంఘాలు కానీ వెనక్కి తగ్గకపోవడం..తెలుగు సినిమాకి సంబంధించి కన్నడ మార్కెట్ చాలా కీలకమైనది..అలాంటి చోట బాహుబలి రిలీజ్ కాకపోతే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగారు. తన అఫిషియల్ సోషల్ మీడియా పేజీలో కన్నడలో మాట్లాడిన ఓ వీడియో పోస్ట్ చేశారు. నాకు కన్నడ సరిగా రాదు..ఏవైనా తప్పులు పలికుంటే క్షమించండి అంటూ ప్రారంభించిన రాజమౌళి.ఎప్పుడో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో బాహుబలికి ముడిపెట్టకండి. అవి సత్యరాజ్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, వాటితో బాహుబలి యూనిట్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బాహుబలి కోసం ఐదేళ్ల నుంచి ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు. అందరి కష్టం ఫలించే సమయంలో విడుదలను అడ్డుకుంటే తాము నష్టపోవాల్సి వస్తుందని, బాహుబలి పార్ట్-1ని ఆదరించినట్లుగానే..రెండో భాగాన్ని కూడా కన్నడ ప్రేక్షకులు ఆదరించాలని జక్కన్న కోరారు.