చివరకు ‘అర్జున్ రెడ్డి’ సాధించింది ఇదా?
on Oct 14, 2017
అర్జున్ రెడ్డి ఎట్టకేలకు వందరోజుల్ని పూర్తి చేసుకుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ఓ మంచి కథను ఎంచుకొని దాన్ని బోల్డ్ గా తీసి పలువురి మన్ననలు, మరికొందరి విమర్శలనూ ఎదుర్కొన్నాడు. విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య ఈ సినిమా విడుదలైన తొలి రెండు వారాలు హాట్ హాట్ గా సాగాయ్. ఓ విధంగా ఈ సినిమాకు అవి కూడా కలిసొచ్చాయ్. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమా కాకపోయినా.. యువతరం బాగా ఆదరించారు.
కొందరు ట్రేడ్ పండితులు.. ఈ సినిమా 40 కోట్ల షేర్ వస్తుందని జోస్యం చెప్పారు. కానీ.. అలా జరగలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవ్వడమే ఇందుకు కారణం. 25 కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిందీ సినిమా. అయితే.. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు కేవలం 6 కోట్లు. అంటే.. పెట్టిన ఖర్చకు అయిదు రెట్టు వసూలు చేసింది ‘అర్జున్ రెడ్డి’. ఆ విధంగా చూస్తే ఇది బ్లాక్ బస్టర్ హిట్. అందులో నో డౌట్.
సందీప్ రెడ్డి వంగా.. మంచి బుక్ రీడర్ అవ్వడం.. చలం, గోపీచంద్.. లాంటి మహామహుల సాహిత్యం చదివిన వాడు అవ్వడంతో... ఆ ప్రభావం ‘అర్జున్ రెడ్డి’లో ప్రస్ఫుటంగా కనిపించింది. పుస్తకాల్లో మాత్రమే చదవగలిగిన ఎమోషన్లను తెరపై చూపించి.. మేధావులను సైతం మెప్పించగలిగాడు. అందుకే... ఇతర భాషలు కూడా ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ గురించి ఆలోచిస్తున్నాయ్. బాలీవుడ్ లో రణబీర్ సింగ్ ఈ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ తనయుడు ఈ సినిమా రీమేక్ ద్వారానే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. విభిన్న తరహా చిత్రాల దర్శకుడు బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఓ విధంగా ఈ మధ్యకాలంలో ‘బాహుబలి’ తర్వాత బయటివారిని కూడా ఆకట్టుకున్న తెలుగు సినిమా అంటే... అది ‘అర్జున్ రెడ్డి’ మాత్రమే.
ఈ ఏడాది తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్స్.. బాహుబలి ది కంక్లూషన్, ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి, నేను లోకల్ చిత్రాల చెంతన ‘అర్జున్ రెడ్డి’ కూడా నిలిచాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. త్వరలోనే ఈ చిత్రం శతదినోత్సవం జరపాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.
కంగ్రాట్స్... అర్జున్ రెడ్డి.