ఆమెతోనే కాదు.. ఎవరితోనూ నేనలా బిహేవ్ చెయ్యలేదు.. డైరెక్టర్ వాదన!
on Sep 20, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనపై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించాడు. "నేను చెప్పదలచుకున్నది ఆ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి" అని ట్వీట్ చేశాడు. టాలీవుడ్లో 'ప్రయాణం', 'ఊసరవెల్లి' వంటి చిత్రాల్లో నటించిన పాయల్ ఘోష్, ఏబీఎన్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 48 ఏళ్ల అనురాగ్ కశ్యప్ తనను బలవంతం చేయబోయాడని ఇటీవల ఆరోపించారు. అయితే అనురాగ్ కశ్యప్ ఈ ఆరోపణలను వరుస ట్వీట్లలో కొట్టిపారేశాడు. వాటిని తనను "నిశ్శబ్దం చేసే ప్రయత్నం" అని అభివర్ణించాడు.
హిందీలో పోస్ట్ చేసిన ఒక సుదీర్ఘ నోట్లో అనురాగ్ కశ్యప్ "వావ్, నన్ను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించడానికి మీకు చాలా సమయం పట్టింది. ఫర్వాలేదు... నన్ను నిశ్శబ్దం చేసే ప్రయత్నంలో, మీరు స్త్రీ అయినప్పటికీ మరొక స్త్రీని ఇందులోకి లాగారు. దయచేసి పరిమితులకు కట్టుబడి ఉండండి మేడమ్. నేను చెప్పదలచుకున్నది ఆరోపణలన్నీ నిరాధారమైనవి." అని రాసుకొచ్చాడు.
తనను లైంగికంగా వేధించిన తరువాత, అనురాగ్ కశ్యప్ తనకు "ఇట్స్ ఓకే" అని చెప్పాడని, ఎందుకంటే హుమా ఖురేషి (గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్), మహి గిల్ (దేవ్ డి) లాంటి తారలు కేవలం ఒక కాల్ దూరంలో ఉంటారని అతను చెప్పాడని తెలిపింది. ఈ ఆరోపణపై స్పందిస్తూ, కశ్యప్ తన ట్వీట్లో "ఇది నా మొదటి భార్య లేదా రెండో భార్య, లేదా స్నేహితురాలు అయినా... లేదా నాతో పనిచేసిన తారలైనా... లేదా నాతో పనిచేస్తున్న మహిళా సహోద్యోగులైనా... నేను బహిరంగంగా కానీ లేదా ఇతరత్రా కానీ అలాగ ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాంటి ప్రవర్తనను నేను సహించను. ఇక, ఏం జరుగుతుందో... చూద్దాం. ఆరోపణలు ఎంత నిజమో వీడియోలో మీరు గుర్తించవచ్చు." అని తెలిపాడు.
Also Read