తెలుగులో తొలి సిల్వర్ జూబ్లీ మూవీ 'బాలరాజు' (1948) కథేమిటి?
on Oct 25, 2020
అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన ఆరో చిత్రం 'బాలరాజు'. ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఏఎన్నార్ను సినీ నటుడిగా మార్చిన ఆయన మార్గదర్శకుడు ఘంటసాల బలరామయ్య నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హీరోగా ఆయన కెరీర్ను పదిలం చేయడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆయనకు క్రేజ్ను తీసుకొచ్చింది. బాలరాజుకు కథను అందించింది సముద్రాల రాఘవాచార్య. రెండు భాగాలుగా ఈ కథ నడుస్తుంది. మొదట స్వర్గంలో 20 నిమిషాల పాటు కథ స్వర్గంలో నడిస్తే, తర్వాత రెండు గంటల సేపు భూలోకంలో నడిచే కథ బాలరాజు.
ఆ కథేమిటంటే..
దేవకన్య మోహిని మంచి నాట్యకత్తె. యక్షుణ్ణి ప్రేమిస్తుంది. మోహిని అపురూప సౌందర్యం ఇంద్రుణ్ణి స్థిమితంగా ఉండనీయదు. ఆమె తన కొలువులో నృత్యం చేయాలని ఆమె తండ్రిని ఆజ్ఞాపిస్తాడు. మోహిని ఒప్పుకోదు. తనకు అడ్డు అయ్యాడనే కోపంతో భూలోకంలో ప్రేమంటే తెలీని జడునివికమ్మని యక్షుణ్ణి శపిస్తాడు. మోహినిని బలవంతంగా తన సభకు రప్పిస్తాడు. నాట్యానికి ససేమిరా అంటుంది మోహిని. ఆవేశంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆమెను మానవ జన్మ ఎత్తి, ఫలించని ప్రేమతో అల్లాడమని శపిస్తాడు.
యక్షుడు వెలమవాళ్లింట బాలరాజుగా, మోహిని కమ్మవాళ్లింట సీతమ్మగా పుట్టి పెరుగుతుంటారు. సీతమ్మను ఎవరికంటా పడకుండా ఊరి బయట ఒక ఒంటిస్తంభం మేడలో పెంచుతుంటాడు కమ్మనాయుడు. ఒకరోజు బాలరాజు తన స్నేహితుడు యలమందతో కలిసి ఆ ఇంటిమీదుగా వెళ్లడం చూస్తుంది మోహిని. తొలిచూపుతోనే పాతప్రేమ చిగురిస్తుంది. ఇల్లు విడిచి బాలరాజును కలుసుకుంటుంది సీత. ఆమె నిద్రపోతుండగా జడత్వంతో వెళ్లిపోతాడు బాలరాజు. వద్దన్న కొద్దీ తనవెంట పడుతున్న సీతను మొదట దెయ్యంగా భావిస్తాడు. తర్వాత మంచిదని నమ్ముతాడు.
అడవి దొంగలు మత్తుమందుజల్లి సీతను ఎత్తుకుపోతారు. వెతకడానికి వెళ్ళిన బాలరాజు మునిశాపంతో పాముగా మారిపోతాడు. సీత తప్పించుకువచ్చి పామైన బాలరాజును కలుసుకుంటుంది. తర్వాత వరసబెట్టి కష్టాలొస్తాయి. బాలరాజు చనిపోతాడు. అశ్వనీ దేవతలు ఇచ్చిన సంజీవిమాలతో అతణ్ణి బతికించుకుంటుంది సీత. ఇంద్రుడు మళ్లీ తయారై ఆమెను నిర్బంధిస్తాడు. దాంతోనూ ఫలితం కనిపించక మాయసీతగా మారి బాలరాజుతో సరసాలాడతాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి సీత శపించబోయేసరికి శచీదేవి వచ్చి భర్తను కాపాడమనటంతో కథ సుఖాంతం.
బాలరాజు క్యారెక్టర్తో ఏఎన్నార్ యూత్ ఐకాన్తో మారితే, యలమంద పాత్రతో కస్తూరి శివరావు స్టార్ కమెడియన్ అయిపోయారు. మోహిని పాత్రతో అంజలీదేవి నటన అలరించింది. ఆమెపై చిత్రీకరించిన 'తీయని వెన్నెల రేయి' పాట ఆ రోజుల్లో బ్లాక్బస్టర్ హిట్.
తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు (బాలరాజు), యస్. వరలక్ష్మి (సీత), అంజలీదేవి (మోహిని), గాదేపల్లి, డి.ఎస్. సదాశివరావు, కస్తూరి శివరావు (యలమంద)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్, గాలిపెంచల నరసింహారావు
నిర్మాత, దర్శకుడు: ఘంటసాల బలరామయ్య
బేనర్: ప్రతిభా ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 ఫిబ్రవరి 1948