ప్రధానికి ఇచ్చే విరాళాలతో జాగ్రత్త!
on Apr 7, 2020
ప్రధానమంత్రి జాతీయ సహాయనిధిలో డిసెంబర్ 2019కి రూ.3,800 కోట్లు ఉన్నప్పుడు, మళ్లీ సపరేట్గా విరాళాలు స్వీకరించడం ఎందుకు? అని హీరోయిన్ అమైరా దస్తూర్ ప్రశ్నిస్తోంది. తెలుగులో సందీప్ కిషన్ సరసన 'మనసుకు నచ్చింది', రాజ్ తరుణ్ సరసన 'రాజుగాడు' సినిమాల్లో నటించిందీ అమ్మాయి. కరోనా నియంత్రణకు, కరోనాపై యుద్ధానికి సినిమా తారలు అందరూ కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్న తరుణంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అమైరా దస్తూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
"ధర్మకర్తలు (ట్రస్ట్ మెంబెర్స్) రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా? లేదా వ్యక్తిగత సామర్థ్యం మేరకు పని చేస్తున్నారా? ట్రస్ట్ డీడ్ ప్రజలకు ఎందుకు అందుబాటులో లేదు? ట్రస్ట్ రిజిస్టర్ చేయడం అనేది పెద్ద పని. వాళ్ళు ట్రస్ట్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు? ఏ యాక్ట్ కింద చేశారు? విరాళాల మొత్తం రూ. 22,414 కోట్లు. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయో, ఖర్చు చేశారో కేంద్రం ఎలా ప్రకటిస్తుంది?" అని అమైరా ప్రశ్నించారు. అంతే కాదు... మార్చి 28న 'పీఎం కేర్స్ ఫండ్'కి అనౌన్స్ చేసిన స్విఫ్ట్ కోడ్ అంతర్జాతీయ లావాదేవీలు (ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్స్) కోసం ఉపయోగించేదనీ, అది తీసేసి మళ్ళీ రెండు రోజుల తర్వాత ఎందుకు షేర్ చేశారనీ ఆమె మరో ప్రశ్న సంధించారు. "మీరు ఎక్కడ డొనేషన్స్ ఇస్తున్నారు? జాగ్రత్త" అని హెచ్చరించింది.