జాన్వీకి సారీ చెప్పిన అమితాబ్
on Aug 4, 2020
జాన్వీకి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సారీ చెప్పారు. ఈమె శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కాదు, జాన్వీ మఖీజా. ఓ సాధారణ మహిళ. ఆమెకు అమితాబ్ ఎందుకు సారీ చెప్పారో తెలుసా? అయితే, అసలు వివరాల్లోకి వెళ్లి చదవండి.
ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్ బచ్చన్ కరోనా చికిత్స తీసుకున్నారు. ఆ ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల గురించి, వాళ్ళు వ్యవహరించిన తీరు గురించి గొప్పగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అదే నానావతి ఆస్పత్రిలో జాన్వీ మఖీజా తండ్రి కరోనా చికిత్స తీసుకున్నారు. తరవాత వేరే ఆస్పత్రిలో యాంటీ బాడీస్ టెస్ట్ చేయించగా, ఆయనకు అసలు కరోనా సోకలేదనే విషయం బయటపడింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది.
"మా నాన్నకు కరోనా సోకలేదు. కానీ, కొవిడ్19 పాజిటివ్ అని నానావతి ఆస్పత్రిలో తప్పుగా చూపించారు. ఆయనకు 80 ఏళ్ళు. ట్రీట్మెంట్ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనివ్వలేదు. డిశ్చార్జ్ అయిన తరవాత పేరున్న మరో ఆస్పత్రిలో యాంటీ బాడీస్ టెస్ట్ చేయించగా, అసలు కరోనా సోకలేదని తెలిసింది. ఆస్పత్రిలో ఉండటం వల్ల నాన్నకు ఇన్ఫెక్షన్ వచ్చింది. మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వని, డబ్బు సంపాదన లక్ష్యమైన అటువంటి ఆస్పత్రికి మీరు ప్రచారం చేయడం దురదృష్టకరం. సారీ. మీరంటే గౌరవం పోయింది" అని జాన్వీ మఖీజా పేర్కొన్నారు.
జాన్వీ మఖీజా పోస్ట్ పట్ల అమితాబ్ బచ్చన్ స్పందించారు. "జాన్వీ జీ... మీ నాన్నగారి పరిస్థితి తెలిసి బాధ పడ్డాను. అయామ్ సారీ. యంగ్ ఏజ్ నుండి నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. పేషెంట్ల గురించి డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యస్... ల్యాబ్ టెస్టులు తప్పుగా రావచ్చు. కానీ, డాక్టర్లు కావాలని ఏదీ చేయరు. డబ్బు కోసం ట్రీట్మెంట్ చేయరు. నానావతి ఆస్పత్రికి ప్రచారం చేస్తున్నాని మీరన్న మాటతో నేను ఏకీభవించడం లేదు. వాళ్ళకు థాంక్స్ చెప్పారు. మీకు నాపై గౌరవం పోవచ్చు. కానీ,వైద్యవృత్తి, వైద్యులపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది" అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.