బిగ్ బ్రేకింగ్: అమిబాబ్, అభిషేక్లకు కరోనా!
on Jul 12, 2020
బిగ్ బి అమితాబ్ బచ్చన్, అయన తనయుడు అభిషేక్ బచ్చన్ కొవిడ్-19 బారినపడ్డారు. ఆ ఇద్దరికీ కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. టెస్టుల్లో తాము కొవిడ్-19 పాజిటివ్గా తేలినట్లు ఆ తండ్రీ కొడుకులు తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా వెల్లడించారు. తమకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించినట్లు అభిషేక్ వెల్లడించాడు.
"ఈ రోజు పొద్దున్నే మా నాన్న, నేను కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇద్దరికీ లక్షణాలు మైల్డ్గా ఉన్నాయి. హాస్పిటల్లో చేరాం. సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశాం. మా ఫ్యామిలీ మెంబర్స్, స్టాఫ్ అందరూ టెస్టులు చేయించుకుంటున్నారు. అందరూ ప్రశాంతంగా ఉంటూ భయభ్రాంతులకు లోనుకావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్యూ" అని 44 ఏళ్ల అభిషేక్ ట్వీట్ చేశాడు.
అందిన సమాచారం ప్రకారం 77 సంవత్సరాల అమితాబ్ కొద్దిపాటి శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. శనివారం రాత్రి ఆయన, "నేను కొవిడ్ పాజిటివ్గా టెస్టుల్లో వెల్లడైంది. హాస్పిటల్కు షిఫ్టయ్యాను. సంబంధిత అధికారులకు హాస్పిటల్ వాళ్లు సమాచారం అందించారు. మా కుటుంబం, సిబ్బంది టెస్టులు చేయించుకుంటున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత పది రోజులుగా మాతో సన్నిహితంగా గడిపిన వాళ్లందరినీ దయచేసి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా" అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో రాశారు.
రాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా శనివారం హాస్పిటల్లో అమితాబ్, అభిషేక్ ఇద్దరూ పరీక్ష చేయించుకున్నారు. అమితాబ్ తన ఇంట్లోనే షూటింగ్లో పాల్గొంటున్నారు. రెండు వాణిజ్య ప్రకటనల్లో ఆయన నటిస్తున్నారు. అలాగే టీవీ క్విజ్ షో 'కౌన్ బనేగా క్రోర్పతి' తర్వాతి సీజన్కు సంబంధించిన ప్రోమో కూడా ఆయన చేస్తున్నారు. మరోవైపు అభిషేక్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్టు ద షాడోస్' జూలై 10 నుంచి ప్రైమ్ వీడిలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read