డిసెంబర్ 2న 'కేజీఎఫ్' నిర్మాతలు అనౌన్స్ చేసే సినిమా ప్రభాస్తోటేనా?
on Nov 30, 2020
యష్ హీరోగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' సినిమాని నిర్మిస్తోన్న హోంబళే ఫిలిమ్స్ మరో భారీ పాన్ ఇండియా ఫిల్మ్ను నిర్మించేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తోంది. డిసెంబర్ 2 బుధవారం మధ్యాహ్నం 2:09 గంటలకు తమ తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు తెలిపారు. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి పనిచేయడానికి ప్రభాస్ అంగీకరించాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హోంబళే ఫిలిమ్స్ నుంచి ఈ అనౌన్స్మెంట్ రానుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాము ఎవరితో ఆ సినిమా తీస్తున్నామో నిర్మాతలు చిన్న క్లూ కూడా ఇవ్వకపోయినప్పటికీ, వారి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై రకరకాల ప్రెడిక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. అవన్నీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీనే సూచిస్తున్నాయి.
హోంబళే ఫిలిమ్స్ అధినేతలు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, "డియర్ ఆడియెన్స్, మాకంటే ఎక్కువగా మా సినిమాని మీరెప్పుడూ ప్రేమించారు. ఈ ప్రేమను కొనసాగించడానికీ, ఈ ప్రేమను పొందడానికీ మేం మా తదుపరి ఇండియన్ ఫిల్మ్తో వస్తున్నాం. డిసెంబర్ 2న 2:09 గంటలకు వచ్చే మా అనౌన్స్మెంట్ కోసం మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. #HombaleFilms7 @vkiragandur @hombalefilms” అని రాసుకొచ్చారు. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన మరుక్షణం నుంచే, కామెంట్స్ సెక్షన్లో తామెంతగా ఆ ప్రకటనకు ఉత్తేజితులయ్యామో తెలియజేస్తూ వస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్తో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్లో దాని లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. సంజయ్ దత్ విలన్గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీలో రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్ స్టోరీ నెరేటర్ రోల్ చేస్తున్నారు. మరోవైపు 'రాధే శ్యామ్' సినిమా చేస్తున్న ప్రభాస్, దాని తర్వాత 'ఆదిపురుష్' మూవీని స్టార్ట్ చేయనున్నాడు. దాని తర్వాత వైజయంతీ మూవీస్ బేనర్పై నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడానికి అతను అంగీకరించాడు. 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ డైరెక్షన్ మూవీ మధ్యలో ప్రశాంత్ నీల్తో సినిమా చేయనున్నాడని తాజాగా వినిపిస్తోంది.
Also Read