రేప్ చేసి చంపుతామని బెదిరించారు.. అమీషా పటేల్ షాకింగ్ అలగేషన్స్!
on Oct 29, 2020
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అభ్యర్థి ప్రకాశ్ చంద్ర తరపున ప్రచారం చేసిన సందర్భంలో తాను భయోత్పాతానికీ, బెదిరింపులకూ గురయ్యానని బాలీవుడ్ సీనియర్ నటి, 'బద్రి', 'నాని' సినిమాల హీరోయిన్ అమీషా పటేల్ ఆరోపించారు. స్వయంగా ప్రకాశ్ చంద్ర తనను బెదిరించాడని ఆమె చెప్పారు. అయితే ఆమె ఆరోపణలను ఆ రాజకీయ నాయకుడు ఖండించారు.
ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంలో ఒక ఆడియో క్లిప్కు స్పందనగా అమీషా పటేల్ ఈ ఆరోపణలు చేశారు. వైరల్ అయిన ఆ ఆడియోలో ఇటీవల తను వెళ్లిన బిహార్లోని దౌడ్నగర్లో ఎదురైన అనుభవాన్ని అమీషా వివరించడం వినిపించింది. అయితే ఆ ఆడియో ప్రామాణికతను ధ్రువీకరించాల్సి ఉంది.
"నా ప్రాణాలు, నా టీమ్ ప్రాణాల గురించి ఆ పర్యటనలో చాలా భయపడ్డాను. సురక్షితంగా ముంబైకు చేరుకొనే దాకా వాళ్లు చెప్పినట్లు నడచుకోవడం తప్ప నాకు వేరే గత్యంతరం లేకపోయింది. ముంబైకి తిరిగి వచ్చేటప్పుడు కూడా, ఆయనతో అప్పటికే భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొని ఉన్నప్పటికీ, తన గురించి గొప్పగా చెప్పమంటూ ప్రకాశ్ చంద్ర నాకు బెదిరింపు మెసేజ్లు పంపాడు" అని చెప్పింది అమీషా.
ప్రచారం సందర్భంగా చంద్ర ఆదేశాలు పాటించకపోతే తనను రేప్ చేసి చంపుతామంటూ బెదిరించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. "ముంబైలో దిగగానే నేను నిజం చెప్పాల్సింది. నేను రేప్కు, హత్యకు గురికావచ్చు. ప్రచారం జరుగుతున్నంత కాలం, నా కారును ప్రకాశ్ చంద్ర మనుషులు చుట్టుముట్టే ఉన్నారు. తమ ఆదేశాలు పాటించే దాకా వాళ్లు నన్ను కదలనివ్వలేదు. ఆయన నన్ను ట్రాప్ చేసి, నా ప్రాణాలను ప్రమాదంలో పెట్టాడు" అని ఆరోపించింది అమీషా.
ఈ ఆరోపణలన్నింటినీ ప్రకాశ్ చంద్ర ఖండించారు. జన్ అధికార్ పార్టీ నాయకుడు పప్పూ యాదవ్ డబ్బులిచ్చి ఆమెచేత అబద్ధాలు మాట్లాడిస్తున్నాడని ఆయన చెప్పారు. "నేను జనం ఓట్ల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలనే నమ్మకం ఉన్నవాడిని. కానీ ఓబ్రాలో నా బంధువుల్లో ఒకరు అమీషా పటేల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆమెకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆమె చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ జరగలేదు. సోనాక్షి సిన్హా కూడా బిహార్కు చెందిన నటే. పప్పూ యాదవ్ను అమీషా కలిశారు. వారి మధ్య రూ. 15 లక్షలకు బేరం కుదిరింది" అని చంద్ర చెప్పారు.
Also Read