జనసేనకు అండగా 'మెగా'సేన!
on Apr 8, 2019
జనసేనాని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మెగాసేన మెల్ల మెల్లగా కదులుతోంది. మెగాస్టార్ చిరంజీవి తప్ప... మెగా కుటుంబంలో మిగతా హీరోలు అందరూ జనసేనకు 'జై' కొడుతున్నారు. అభిమానులు వర్గాలుగా విడిపోకుండా ఒక్కటిగా కలిసి ఉండేలా... తామంతా ఒక్కటే అనే సంకేతాలను ప్రజల్లోకి పంపిస్తున్నారు.
జనసేన పార్టీకి ముందుగా జై కొట్టినది మెగా మదర్ అంజనాదేవి. కుమారుల్లో చిన్నవాడు పవన్ పెట్టిన పార్టీకి విరాళం ఇచ్చారామె. పార్టీ ఆఫీసుకు వెళ్లి కుమారుణ్ణి కలిసి ఆశీర్వదించారు. తరువాత మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాగబాబు, నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి మెగా కుటుంబంలో ఒక్కొక్కరు జనసేన కు మద్దతు పలుకుతూ వస్తున్నారు. అల్లు అర్జున్ రెండు రోజుల క్రితమే జనసేనకు మద్దతుగా ఓ లేఖను విడుదల చేశారు. మంగళవారం పవన్ దగ్గరకు వెళ్లి నేరుగా కలిసి మరోసారి మద్దతు ప్రకటించనున్నారు. నాగబాబును కూడా అల్లు అర్జున్ కలవనున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ను రామ్ చరణ్ కలిసిన సంగతి తెలిసిందే. తన కాలుకు గాయమైనా... ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా... ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన బాబాయ్ ను కలిసి పరామర్శించారు. ఇక, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, తనయ నిహారిక తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో దిగారు.
మెగా అభిమాన సంఘాలు కూడా జనసేనానికి 'జై' కొడుతున్నాయి. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో పనులు చక్కబెట్టే బన్నీ వాసు... చిరంజీవి కుటుంబానికి, అభిమానులకు మధ్య వారధిలా నిలిచే స్వామి నాయుడు, శివ చెర్రీ తదితరులు ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని పక్కన పెడితే... మెగా కుటుంబం, మెగా అభిమానులు ఒక్కతాటిపై ఉన్నారని స్పష్టమవుతోంది.