ఎవరికైనా సోలో రిలీజ్ కావాలి: అల్లు అర్జున్
on Jan 11, 2020
ఎవరైనా సోలో రిలీజ్ కావాలనుకుంటారని అల్లు అర్జున్ అన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా రెండు సినిమాల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాలు ప్రచారం, పబ్లిసిటీ విషయాల్లో పోటీపడ్డాయి. నేరుగా ఈ అంశం మీద కానప్పటికీ... సంక్రాంతి సినిమాల పోటీపై అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని చెప్పారు. యుగయుగాలుగా సంక్రాంతి పోటీ ఉందని ఆయన అన్నారు.
"ఎవరైనా సోలో రిలీజ్ కోరుకుంటారు. కావాలనుకుంటారు. ఎందుకంటే... సినిమా బడ్జెట్ లో 30, 40 పర్సెంట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి. సంక్రాంతి సీజన్ లో రెండు మూడు సినిమాలకు స్కోప్ ఉంటుంది. సాధారణ రోజుల్లో సినిమాలు విడుదలైనప్పుడు వచ్చే కలెక్షన్స్ కంటే సంక్రాంతికి విడుదలైనప్పుడు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. యుగయుగాలుగా సంక్రాంతి పోటీ ఉంది. మా సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాలు అన్నీ విజయాలు సాధించాలి" అని అల్లు అర్జున్ అన్నారు.
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదల తర్వాత అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'అల వైకుంఠపురములో'. 'త్రివిక్రమ్ తో సినిమా సేఫ్ అని చేశారా?' అని అతడిని ప్రశ్నించగా... "అసలు సినిమానే సేఫ్ కాదు" అని నవ్వేశారు. ''రేసుగుర్రం' లాంటి ఫన్ ఫిలిం చేయాలని నేను, 'అరవింద సమేత' తరవాత ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని త్రివిక్రమ్ గారు అనుకుని ఈ సినిమా చేశాం" అని అల్లు అర్జున్ అన్నారు.