సుకుమార్ గ్యాప్ పెరిగిపోతుందన్నాడని...
on Jan 11, 2020
సుకుమార్ సినిమా కోసం 'ఐకాన్' సినిమాను కాస్త వెనక్కు జరిపానని అల్లు అర్జున్ తెలిపాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మాణంలో 'ఐకాన్' సినిమా చేయనున్నట్టు అల్లు అర్జున్ నుండి ప్రకటన వచ్చింది. అలాగే, సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కి కూడా ఒక సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పారు. రెండు సినిమాల్లో ముందుగా 'ఐకాన్' పట్టాలు ఎక్కుతుందని దిల్ రాజు కాంపౌండ్ నుండి వార్తలు వచ్చాయి. కానీ, సుకుమార్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సైలెంట్ గా జరిగింది. కట్ చేస్తే... 'పింక్' రీమేక్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నట్టు 'దిల్' రాజు అధికారికంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ అందులో హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. అసలు, ఏమైంది? 'ఐకాన్' సినిమాను పక్కన పెట్టారా? అనే ప్రశ్నలు వచ్చాయి. వీటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పారు.
"రెండు మూడు రోజుల గ్యాప్ లో సుకుమార్ సినిమా, 'ఐకాన్' సినిమా కథలు విన్నాను. నాకు రెండూ నచ్చాయి. అయితే... 'రంగస్థలం' తర్వాత గ్యాప్ పెరిగిపోతుందని, తన సినిమా త్వరగా చేద్దామని సుకుమార్ అడిగాడు. అందుకని, ఆ సినిమా ముందు చేస్తున్నాను. ఈ విషయం 'ఐకాన్' దర్శకుడికి, నిర్మాతకు కూడా చెప్పాను. సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా చేస్తా" అని అల్లు అర్జున్ అన్నారు.
మంచి కథ కుదిరితే ఏ హీరోతోనైనా మల్టీస్టారర్ చేయడానికి తాను సిద్ధమనీ, రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని ఉన్నదని అల్లు అర్జున్ అన్నారు. అతి త్వరలో పాన్ ఇండియా సినిమా చేస్తానని ఆయన చెప్పారు.