రిషి కపూర్ ప్రథమ వర్ధంతి తర్వాతే ఆ ఇద్దరి పెళ్లి!
on Oct 16, 2020
రణబీర్ కపూర్, అలియా భట్ తమ మధ్య అనుబంధాన్ని 2019లో బయటి లోకానికి వెల్లడించారు. అప్పట్నుంచీ అనేక ఫంక్షన్లకు కలిసి వస్తూ, కలిసి తిరుగుతూ తమ మధ్య అనురాగాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ వస్తున్నారు. కాగా, ఆ ఇద్దరూ ఫ్రాన్స్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనీ, దీని కోసం డిజైనర్ సవ్యసాచి ముఖర్జీతో వారు చర్చలు కూడా జరుపుతున్నారనీ, కేటరర్స్ను బుక్ చేశారనీ.. ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులని తేలిపోయాయి.
రణబీర్, అలియా ఇద్దరూ తమ తమ సినిమాలతో బాగా బిజీగా ఉండటం వల్ల వారి పెళ్లి 2021కి వాయిదా పడిందని వినిపిస్తోంది. రణబీర్ తండ్రి రిషి కపూర్ ఆకస్మిక మృతి కూడా వారి పెళ్లి వాయిదా పడటానికి మరో కారణం. రిషి ఈ ఏడాది ఏప్రిల్లో మరణించారు. అందువల్ల ప్రథమ వర్థంతి జరిపేవరకూ ఆ ఇంట్లో పెళ్లి జరిగే వీలు లేదనీ, ఆ తర్వాతే రణబీర్, అలియా వివాహం ఉంటుందనీ వారి కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. ఆ ప్రకారం చూస్తే, 2021 ద్వితీయార్ధంలో ఆ పెళ్లి జరగవచ్చు.
నిజానికి రిషి జీవించి ఉన్నట్లయితే ఈ ఏడాది డిసెంబర్లో రణబీర్, అలియా వివాహం జరిగేదంటున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి ఒకవైపు, ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ మరోవైపు ఉండటంతో ఆ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి మాట తలపెట్టడం లేదు.
ప్రస్తుతం ఆ ఇద్దరూ తొలిసారిగా 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో జంటగా నటిస్తున్నారు. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2020 డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా దెబ్బకు షూటింగ్ ఆగిపోవడంతో అనివార్యంగా విడుదల పోస్ట్పోన్ అయ్యింది. మరోవైపు అలియా 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియవాడి', 'తఖ్త్' లాంటి సినిమాలతో మహా బిజీగా ఉంది.
Also Read