కూతుర్ని నిరుపేద వృద్ధ దంపతుల ఇంటికి తీసుకెళ్లిన అక్షయ్!
on Oct 17, 2020
అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ కావచ్చు కానీ, నిజ జీవితంలో తండ్రి పాత్ర పోషణలోనే అతనెక్కువ సంతృప్తి చెందుతుంటాడు. సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్లు చేయడం కంటే ఫ్యామిలీతో టైమ్ గడపడాన్నే తానెక్కువ ఎంజాయ్ చేస్తానని పలుమార్లు అతను చెప్పాడు. భార్య ట్వింకిల్ ఖన్నా, పిల్లలు ఆరవ్, నితారలతో గడిపే ప్రతి క్షణం తనకెంతో విలువైందని అతనంటాడు. ముఖ్యంగా కూతురు నితారతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తుంటాడు అక్షయ్. మార్నింగ్ వాక్ల నుంచి గాలిపటాలు ఎగరేయడం దాకా తన డ్యూటీని అతను నిర్వర్తిస్తుంటాడు.
ఒకసారి నితారకు తాను అందించిన ఒక ప్రాక్టికల్ లెసన్ గురించి షేర్ చేసుకున్నాడు అక్షయ్. ఒకరోజు మార్నింగ్ వాక్ టైమ్లో నిరుపేద వృద్ధ దంపతులు ఉంటున్న రేకుల కప్పు ఉన్న ఇంటికి కూతురిని వెంటబెట్టుకొని వెళ్లాడు. మంచినీళ్లుంటే ఇస్తారా అని అడిగితే, ఆ ముసలివాళ్లు అంతకు మించే వాళ్లకు ఇచ్చారు.
ఆ ఎక్స్పీరియెన్స్ను షేర్ చేస్తూ, "ఈరోజు మార్నింగ్ వాక్ మా అమ్మాయికి ఒక జీవిత పాఠంలా మారింది. కొంచెం మంచి నీళ్ల కోసమని ఒక వృద్ధ దంపతుల ఇంటిలోకి వెళ్తే, వారు మాకు చాలా రుచికరమైన బెల్లం రొట్టెను ఇచ్చారు. నిజంగా, దయ చూపడానికి ఖర్చేమీ కాదు, కానీ అది అన్నీ చెప్తుంది" అని చెప్పాడు అక్షయ్. ఈ సందర్భంగా వారితో కలిసి ఫొటో కూడా దిగారు ఆ తండ్రీకూతుళ్లు.
కష్టాలను ఈదుకుంటూ ఇవాళ రిచ్చెస్ట్ ఇండియన్ యాక్టర్స్లో ఒకడిగా ఎదిగిన అక్షయ్.. తన పిల్లలకు చిన్నప్పట్నుంచే జీవితం అంటే ఏమిటో ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడన్న మాట!
Also Read