'పృథ్వీరాజ్'గా అక్షయ్ కుమార్!
on Sep 9, 2019
చరిత్రలో మనం గొప్పగా చెప్పుకొనే పృథ్వీరాజ్గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ సిద్ధమవుతున్నాడు. అత్యంత ధైర్యసాహసాలు, అతి పరాక్రమవంతుడిగా పేరుపొందిన 'పృథ్వీరాజ్' చరిత్రను అదే పేరుతో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తెరమీదకు తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ మూవీకి డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించనున్నారు. 2020 దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని సంకల్పించారు. చరిత్ర విద్యార్థులకు పృథ్వీరాజ్, సంయుక్తల ప్రేమగాథ సుపరిచితం. దేశంలో ముస్లిం రాజుల దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులని సంఘటితం చేశాడు పృథ్వీరాజ్.
తండ్రి ఆకస్మిక మరణంతో 11 ఏళ్లకే సింహాసనం ఎక్కిన ఆయన అజ్మీర్, ఢిల్లీ జంట రాజధానులుగా ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. కనౌజ్ రాజు జయచంద్రుని కుమార్తె సంయుక్తను ప్రేమించి, జయచంద్రుని అభీష్టానికి విరుద్ధంగా ఆమెను తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు. వాళ్ల ప్రేమగాథను 'పృథ్వీరాజ్ రాసో' అనే కావ్యం ద్వారా చంద్ బర్దై తెలియజేశాడు.
ఇప్పుడు ఈ గాథను చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కిస్తున్నారు. 47 ఎపిసోడ్లు ప్రసారమై ఎంతో పాపులర్ అయిన 'చాణక్య' టీవీ సీరియల్ ద్వారా ఆయన సుప్రసిద్ధుడు. మొదట టీవీ సిరీస్తోటే పేరుపొందిన ఆయన, తర్వాత 'పింజర్' సినిమాతో సినీ దర్శకుడిగా మారి, తొలి సినిమాతోటే విమర్శకుల ప్రశంసల్ని పొందారు. గత ఏడాది సన్నీ డియోల్తో 'మొహల్లా అస్సి' అనే సెటైరికల్ డ్రామా తీశారు.
ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఒక టీజర్ను యూట్యూబ్లో విడుదల చేసింది.