టాక్ ఆఫ్ ది టౌన్: అక్కినేని హీరోల నిజాయతీ!
on Jan 22, 2019
'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. అఖిల్ సినిమా కాబట్టి నాగార్జున, నాగచైతన్య రావడంలో అక్కినేని అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎన్టీఆర్ హాజరు అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఈవెంట్లో ఎన్టీఆర్ మాటలూ స్పెషల్ అట్రాక్షనే. హాట్ టాపిక్ అయ్యాయి. అఖిల్లో ఆత్మ విమర్శ చేసుకునే దమ్ముందనీ, అతణ్ణి అతడు ఆత్మవిమర్శ చేసుకుంటూ చేసుకుంటూ ఎంతో మారాడనీ, 'మిస్టర్ మజ్ను'లో అఖిల్లో అత్యుత్తమ నటన చూస్తారనీ ఎన్టీఆర్ మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం మీద ఎన్టీఆర్ స్పీచ్ హైలైట్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజెంట్ టాక్ ఒఫ్ ది టౌన్ ఏంటంటే... ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య నిజాయతీ. అఖిల్ గురించి వీరిద్దరూ ఎంతో ఓపెన్గా మాట్లాడారు.
అక్కినేని హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ వుంది. ఏయన్నార్ నుంచి నాగార్జున, సుమంత్, నాగచైతన్య అందరికీ రొమాంటిక్ సినిమాలు విజయాలను అందించాయి. ఆఖరికి గతేడాది సుశాంత్కు విజయాన్ని అందించినది కూడా రొమాంటిక్ 'చిలసౌ' సినిమాయే. అయితే.. ఫ్యామిలీ ఇమేజ్కి భిన్నంగా అఖిల్ మాస్ హీరో కావాలని కోరుకున్నాడు. 'అఖిల్', 'హలో' సినిమాల్లో ఫైట్స్ మీద దృష్టి పెట్టాడు. 'మిస్టర్ మజ్ను'లో మాత్రం రొమాన్స్ చేసినట్టు ట్రైలర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీ ఇమేజ్ కలసి రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. అలాగని, అఖిల్ డ్యాన్సుల్లో, ఫైటుల్లో వీక్ అని కాదు. బాగా చేస్తాడు. అక్కినేని అభిమానులు మాత్రం అతణ్ణి ప్రేమకథలో చూడాలనుకున్నారు.
"అఖిల్ డ్యాన్సులు, ఫైటులు బాగా చేస్తాడు. అయితే తమ్ముడు కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తే చూడాలని నా కోరిక. తన బాడీ లాంగ్వేజ్ కి లవ్ స్టోరీ బాగా సూటవుతుంది. వెంకీ అట్లూరి అటువంటి సినిమా చేశాడు" అని నాగచైతన్య అన్నాడు. నాగార్జున "ఎన్టీఆర్ నుంచి అఖిల్ యాక్టింగ్ అండ్ మాస్ నేర్చుకోవాలి" అన్నారు. యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ప్రేక్షకులకు తెలియనిది కాదు. కుమారుడికి అతడి నుంచి యాక్టింగ్, మాస్ నేర్చుకోమని నాగార్జున చెప్పడం ఆయనలో నిజాయతీకి నిదర్శనం అనుకోవాలి. ఈ మాటలు ఎన్టీఆర్ అభిమానుల్ని, సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. నాగార్జున, నాగచైతన్య అంత నిజాయతీగా మాట్లాడటం ఇండస్ట్రీలోనూ డిస్కషన్ పాయింట్ అయ్యింది.