అజ్ఙాతవాసి థియేటర్లపై నందమూరి బ్యానర్లు!
on Jan 9, 2018
నందమూరి, మెగా అభిమానుల మధ్య వైరం ఈ నాటిది కాదు. చిరంజీవి, బాలకృష్ణ సూపర్ స్టార్లుగా ఇండస్ల్రీని శాసిస్తున్న రోజుల నుంచీ వీరి అభిమానుల మధ్య వైరం సాగుతూనే ఉంది. అంటే.. వీరి అభిమానులది 35 ఏళ్ల వైరం అనమాట. దశాబ్దాలుగా సాగుతున్న కమ్మ, కాపు వైరాన్ని.. వీరిద్దరి అభిమానుల వైరం మరింత జటిలం చేసిందనే చెప్పాలి.
తర్వాత కాలంలో చిరంజీవి కుటుంబం నుంచి పవర్ స్టార్, బన్నీ, చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ హీరోలుగా పరిచయం అయ్యారు. బాలయ్య కుటుంబం నుంచి తారక్, కల్యాణ్ రామ్ హీరోలయ్యారు. వీరి వారసుల అభిమానుల మధ్య కూడా అదే వైరం నేటికీ సాగుతుండటం గమనార్హం. అయితే... పవన్ ఇటీవల జరిపిన జనసేన మీటింగులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
‘తెలంగాణలో కుల జాడ్యం లేదు. కేవలం అక్కడ ప్రాంతీయాభిమానమే ఎక్కువ. కానీ.. ఏపీలో కులాల కుమ్ములా ఎక్కువైపోయింది. ముఖ్యంగా కమ్మ, కాపు మధ్య ఈ గొడవ అమితంగా ఉంది. ఇకనైనా ఈ రెండు కులాలు కలిసి పనిచేయాలి. ఐకమత్యంతో ఉండాలి. కులమతాలు జాతి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తాయ్. దేశాభివృద్ధికి కూడా ఇవి ఆటంకాలే. ఏపీ అభివృద్ధి సరిగ్గా లేకపోవడానికి ఇదీ ఓ కారణమే. మా హీరోల్లో ఇక కుల గజ్జి లేదు. మేం కలిసే ఉంటాం. దయచేసి మా అభిమానులు కూడా కలిసే ఉండాలి’ అని చెప్పుకొచ్చాడు.
పవన్ ప్రసంగం కొంతమందిలో మార్పు తెచ్చినట్టుంది. దానికి నిదర్శనం గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన సంఘటన. 10న ‘అజ్ఙాతవాసి’ విడుదల సందర్భంగా పవన్ అభిమానులంతా.. థియేటర్ల అలంకరణతో మునిగిపోయారు. అయితే.. ఈ ఫ్రెక్సీల మధ్య ఓ ఫ్లెక్సీ... ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది ఎన్టీయార్ అభిమానులు కట్టిన ఫ్లెక్సీ కావడం విశేషం. తారక్, పవర్ స్టార్ స్టిల్స్ తో ఉన్న ఆ ఫ్లెక్సీ.. మాచర్ల వాసులందర్నీ ఆకట్టుకుంటోంది. జనసేన మీటింగ్ లో కులాలపై పవర్ స్టార్ చేసిన ప్రసంగమే ఈ మార్పుకు కారణం అని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇది మంచి పరిణామమే.