`ఆదిపురుష్`.. రూ.250 కోట్ల విజువల్ ఎఫెక్ట్స్?
on Apr 5, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ - ఇండియా మూవీస్ లో `ఆదిపురుష్` ఒకటి. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ బేస్డ్ మూవీలో శ్రీరామచంద్రుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు ప్రభాస్. సీత పాత్రని కృతి సనన్ ధరిస్తుండగా.. లంకేశ్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో `ఆదిపురుష్` తెరకెక్కనుందని సమాచారం. అంతేకాదు.. ఇందులో సగం బడ్జెట్ అంటే రూ.250 కోట్లు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారని వినికిడి. రామాయణం ఆధారంగా భారతీయ తెరపై పలు చిత్రాలు వచ్చిన నేపథ్యంలో.. సరికొత్త అనుభూతిని కలిగించేందుకు విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారట. అంతేకాదు.. ఓ కొత్త ప్రపంచాన్ని వీక్షిస్తున్న అనుభూతిని కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తోందట యూనిట్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, 2022 ఆగస్టు 11న `ఆదిపురుష్` థియేటర్స్ లోకి రానుంది. అంతకంటే ముందు.. ఈ ఏడాది జూలై 30న `రాధేశ్యామ్`తోనూ, వచ్చే సంవత్సరం ఏప్రిల్ 14న `సలార్`తోనూ ప్రభాస్ పలకరించనున్నారు.