దేవదాస్ కనకాల కుమార్తె, నటి శ్రీలక్ష్మి మృతి
on Apr 6, 2020
దివంగత నటుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల కుమార్తె, టీవీ నటి శ్రీలక్ష్మి కనకాల (44) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. కొంత కాలంగా ఆమె కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చారు. దానికి తోడు కామెర్ల వ్యాధి రావడంతో ఇటీవల ఆమె ఆరోగ్య స్థితి బాగా క్షీణించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆమె భర్త పెద్ది రామారావు తెలిపారు. ఆయన జర్నలిస్ట్, రంగస్థల కళాకారుడు. నటుడు రాజీవ్ కనకాలకు శ్రీలక్ష్మి చెల్లెలు. పలు టీవీ సీరియల్స్లో నటించడం ద్వారా శ్రీలక్ష్మి తెలుగువారికి సుపరిచితమే. రంగస్థలంపైనా నటిగా ఆమె బాగా రాణించారు.
శ్రీలక్ష్మి మరణంతో ఇటు తెలుగు చిత్రసీమ, అటు టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆమె సహచర నటులు, సన్నిహితులు విచారంలో మునిగిపోయారు. వరుసగా మూడు సంవత్సరాల్లో ఇది కనకాల కుటుంబంలో మూడో మరణం కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం 2018లో శ్రీలక్ష్మి తల్లి లక్ష్మీదేవి కనకాల, గత ఏడాది తండ్రి దేవదాస్ కనకాల చనిపోగా, ఇప్పుడు 2020లో శ్రీలక్ష్మి మరణించడాన్ని ఆ కుటుంబ సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కాగా ప్రస్తుత కరోనా కాలంలో ఆమెను చివరిసారి చూసేందుకు వెళ్లలేకపోతున్నందుకు సినీ, టీవీ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటుడు, రచయిత హర్షవర్థన్ సైతం ప్రస్తుతం బయట విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి, పార్థివ దేహాన్ని దర్శించేందుకు ఎవరూ వెళ్లవద్దని పెద్ది రామారావు, రాజీవ్ కనకాల తరపున అందరికీ విజ్ఞప్తి చేశారు. శ్రీలక్ష్మి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన తెలిపారు.