ఆ రోజు ఏం జరిగిందంటే.. బోని చెప్పేశాడు....
on Mar 4, 2018
అందాల తార శ్రీదేవి దుబాయ్ లో తన బంధువుల వివాహానికి వెళ్లి... అక్కడే కానరాని లోకానికి వెళ్లిపోయారు. ఇక శ్రీదేవి మరణంపై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అసలు ఆరోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు శ్రీదేవి భర్త బోనికపూర్ అసలు ఆరోజు ఏం జరిగిందో బోనీ తన స్నేహితుడు, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాహ్తాతో షేర్ చేసుకున్నారట. ఆ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పుడది వైరల్ అవుతోంది. ఇంతకీ బోని ఏం చెప్పాడంటే...
ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ దుబాయ్ వెళ్లాం. ఆ తర్వాత నాకు లక్నోలో 22న ఒక సమావేశం ఉండటంతో వెనక్కి వచ్చేశాను. నాతో పాటు ఖుషీ కూడా వచ్చేయడంతో శ్రీ ఒక్కతే అక్కడ ఉండిపోయింది. జాన్వీ కోసం షాపింగ్ చేయాలని తను అక్కడ ఆగిపోయింది. ఇక నా మీటింగ్ అయిపోయిన తరువాత ఫిబ్రవరి 24 సాయంత్రం ఆరున్నరకు నేను శ్రీదేవి ఉంటున్న హోటల్ కు చేరుకున్నాను. తనను సర్ప్రైజ్ చేద్దామని వస్తున్నట్టు చెప్పలేదు. నన్ను సడెన్ గా చూసి తను సర్ప్రైజ్ అయింది. ఇద్దరం పావుగంట సేపు మాట్లాడుకున్న తర్వాత, ఫ్రెషప్ అవ్వు, రొమాంటిక్ డిన్నర్ కు వెళ్దాం అని చెప్పాను. దాంతో తను స్నానానికి వెళ్లింది. తను మాస్టర్ బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. నేను కాసేపు టీవీ చూస్తూ గడిపాను. 20 నిముషాలైనా తను బయటికి రాకపోవడంతో శ్రీ ని పిలిచాను. తను పలకలేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మళ్లీ పిలిచాను. తన నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. లోపలికి వెళ్లి, బాత్రూమ్ డోర్ కొట్టాను..డోర్ తీయట్లేదు. లోపల ట్యాప్ ఆన్ చేసి వదిలేసిన శబ్దం వినిపిస్తోంది. దాంతో ఆందోళనగా అనిపించి, డోరును బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశాను. బోల్ట్ సరిగ్గా పెట్టకోకపోవడంతో డోర్ త్వరగానే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే, బాత్ టబ్ లో శ్రీ పూర్తిగా మునిగిపోయి ఉంది. నాకు ప్రపంచం ఆగినట్టు అనిపించింది. ఏమీ అర్ధం కాలేదు. అలా స్థాణువులా నిలబడిపోయాను. ఇక ఆ తర్వాత హోటల్ సిబ్బందిని పిలవడం, ఆంబులెన్స్ లో హాస్పటల్ కు తీసుకెళ్లడం అన్నీ జరిగాయి” అని జరిగినదంతా తన స్నేహితుడితో షేర్ చేసుకున్నారట బోనీ కపూర్.