శ్యామ్ కె. నాయుడు నుంచి రక్షణ కల్పించండి: శ్రీసుధ
on Jan 24, 2021
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడుపై నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ, తనకు రక్షణ కల్పించాలనీ ఆమె సంజీవరెడ్డి నగర్ పోలీసులను కోరారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు సహజీవనం చేశాక తనను మోసం చేశాడంటూ గత ఏడాది చేసిన తన ఫిర్యాదులో ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి తాను రాజీ కుదుర్చుకున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి కోర్టుకు సమర్పించాడనీ, అయినా అతడిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదనీ ఆమె తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాజీ కుదుర్చుకోవాలనీ, విషయం బయటకు చెప్పవద్దనీ ఆయనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరామ్ మాగంటి తనను హెచ్చరించారనీ శ్రీసుధ ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శ్యామ్ కె. నాయుడు, చిన్నా, సాయిరామ్పై జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.