జంతువులను బోనుల్లో పెట్టేవాళ్లపై నమిత ఫైర్!
on Mar 24, 2020
కోవిడ్-19 పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రెండు వారాల పాటు బయటకు రాకుండా అందరినీ ఇంట్లోనే ఉండమంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ప్రత్యక్షమవుతుండగా, జూలో జంతువులు ఎలా ఫీలవుతుంటాయో అంటూ ఒక మీమ్ ప్రత్యక్షమైంది. దీన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు.
జంతువులను హింసించడంపై నటి నమిత తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అదే మీమ్ను షేర్ చేసిన ఆమె, "చూశారా, ఇప్పడు మీకు అర్థమవుతుంది! నేనెప్పుడూ జూలకు మద్దతు తెలపను, జూలకు వెళ్లమని ఎవర్నీ ప్రోత్సహించను. కర్ఫ్యూలో కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంటేనే మనం అసహనానికి గురై ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని తహతహలాడిపోతున్నాం. మన సంతోషం కోసం జంతువులను బంధిస్తే, అవి కూడా అలాగే ఫీలవుతుంటాయి. మీ పిల్లలకు బతికున్న జంతువుల్ని చూపించాలనుకుంటే, దయచేసి వాటిని మీ ల్యాప్టాప్లో చూపించండి, లేదా అభయారణ్యంకు తీసుకువెళ్లి చూపించండి. కానీ దయచేసి వాటిని బోనుల్లో పెట్టడం ఆపేయండి. డిప్రెషన్తో, బాధతో అవి చనిపోతాయి. మనం వెళ్లి టిక్కెట్లు కొంటున్నాం కాబట్టి జూలు నిండుగా కనిపిస్తున్నాయి. మనం వెళ్లడం మానితే, అడవికి చెందాల్సిన ఆ ప్రాణుల్ని బంధించడం ఆగిపోతుంది. మళ్లీ చెప్తున్నా, చివరిగా ఒక్క మాట, జంతువులు మనతో పాటు జీవిస్తాయి, మనకోసం కాదు!" అని రాసుకొచ్చింది.
ఆ పోస్ట్కు సెట్ దెమ్ ఫ్రీ, బాయ్కాట్ జూస్, నౌ యు నో ఇట్, కరోనా లెసన్స్, ఐ లవ్ యానిమల్స్, స్టాప్ యానిమల్ అబ్యూజ్ అనే హ్యాష్టాగ్లను జోడించింది.