ఒకేసారి పది చేసేకంటే మంచి సినిమా ఒక్కటి చేసినా చాలు!
on Oct 25, 2020
తెలుగమ్మాయి అంజలి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పద్నాలుగేళ్లు దాటాయి. ఇంతకాలం పాటు ప్రేక్షకులు తనను ఆదరించినందుకు, ఇంకా ఆదరిస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తోందామె. తెలుగమ్మాయిలు మన ఇండస్ట్రీలో నిలబడలేరు అంటుంటారు. కానీ అంజలి అభిప్రాయం వేరుగా ఉంది. "ఇక్కడ తెలుగమ్మాయిల్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే సరైన మార్గాన్ని పొందడంలోనే సమస్యలుంటాయి. మనకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. నేను బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటాను. ఏది పడితే అది ఒప్పుకోను." అని ఆమె చెప్తుంది.
ఒకేసారి పది సినిమాలు చేసేకంటే చేసేది ఒక్క సినిమాయే అయినా, మంచిది చేస్తే ప్రేక్షకుల మనసుల్లో స్థానం ఉంటుందనేది ఆమె అభిప్రాయం. "నాకు కంటెంట్ ముఖ్యం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నేను చేసిన సీత పాత్ర గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. నా కెరీర్కు కచ్చితంగా అది టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఆ సినిమా కాకుండా ఇంకో నాలుగు సినిమాలు చేసినా, నేనెవరికీ గుర్తుండే దాన్ని కాదు. అలాగే 'గీతాంజలి సినిమా కూడా" అని తెలిపింది అంజలి.
ఇటీవల ఆమె 'నిశ్శబ్దం' చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మనకు కనిపించింది. 'వకీల్ సాబ్'లోని ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా, ఒరిజినల్ మూవీ 'పింక్'లో కృతి కుల్హరి చేసిన పాత్రలో కనిపించబోతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న ఎన్బీకే 106 మూవీలో బాలకృష్ణ సరసన ఓ నాయికగా ఆమె నటిస్తోంది.
Also Read