ఆ నటుడు 400 వలస కార్మికుల కుటుంబాలను ఆదుకుంటున్నాడు!
on Jul 14, 2020
నటుడు సోనూ సూద్ తన దయార్ద్ర హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు. సోమవారం అతను కరోనా మహమ్మారి కాలంలో గాయపడిన లేదా మరణించిన 400కు పైగా వలస కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపాడు. వలస కార్మికుల లేదా వారి కుటుంబాల అడ్రస్లు, బ్యాంక్ వివరాలు వగైరా అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. "భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా గాయపడిన లేదా చనిపోయిన వలస కార్మిక కుటుంబాలకు సాయపడాలని నేను నిర్ణయించుకున్నాను. వాళ్లకు సపోర్ట్ చేయాలనేది నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా" అని ఒక ప్రకటనలో తెలిపాడు సోను.
బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటించిన ఆయన కరోనావైరస్ లాక్డౌన్ కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవునిలా మారాడు. గత రెండు నెలలుగా ఈ 46 సంవత్సరాల నటుడు ఒక్క పైసా తిరిగి ఆశించకుండా వేలాది కార్మికులను వాళ్ల సొంత ఊళ్లకు పంపించాడు. వలస కార్మికులను వాళ్ల సొంత ఊళ్లకు పంపించాలంటే అధికారులకు అనేక వివరాలు అందించాల్సి ఉంటుంది. కానీ ఆ పేపర్వర్క్ చేయడం కార్మికుల్లో చాలామందికి తెలీదు. అందుకని తన స్నేహితులు, యువకులైన కొంతమంది కార్యకర్తలతో కలిసి ఆయా కార్మికుల వివరాలను తయారుచేసి, అధికారులకు అందించే పనికూడా చేస్తూ వచ్చారు. సొంత ఊళ్లకు వెళ్తున్న కార్మికుల ముఖాలపై నవ్వు చూడటం తనకు చాలా ఆనందాన్నీ, ఉద్వేగాన్నీ ఇస్తోందని కూడా సోను చెప్పాడు.