కదిలించే ఘటన: ఏవీఎస్కు అపురూప కానుకను ఇచ్చిన వీణాపాణి!
on Sep 24, 2020
కొన్ని సందర్భాల్లో కొంతమంది తమ భావాలను వ్యక్తీకరించేఏ తీరు విభిన్నంగా, ప్రత్యేకంగా, హృదయాన్ని కదిలించే విధంగా ఉంటుంది. దివంగత హాస్యనటుడు ఏవీయస్కు అలాంటి ఘటనే ఒకటి ఎదురయ్యింది. కాలేయం దెబ్బతిని, శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యవంతులైన తర్వాత ఏవీఎస్కు సంగీత దర్శకుడు వీణాపాణి ఒక అపురూపమైన బహుమతిని శుభాకాంక్షల రూపంలో అందించారు. ఏవీఎస్కు ఆయన కుమార్తె తన లివర్లో కొంత భాగాన్ని ఇచ్చి ఆయనకు మరికొంత కాలం జీవించే అవకాశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం వీణాపాణిని విపరీతంగా కదిలించింది. అప్పటికి ఆయన ఆరోగ్యం కూడా ఏమంత బాగా లేదు. అయినప్పటికీ తండ్రీకూతుళ్ల అనుబంధానికి చలించిన ఆయన అందరిలా కాకుండా ఒక పాట తనే రాసి స్వరపరచి, తన థియేటర్లోనే రికార్డ్ చేసి, ఆ సీడీని కానుకగా ఏవీఎస్ ఇంటికి వెళ్ల మరీ అందజేశారు.
"ఈ జన్మకు నాన్నవు నీవు.. ఆ దేవుడి వరమైనావు.. మరుజన్మకు నీ తల్లినా కానా".. అనే పల్లవితో సాగే ఆ పాటను ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు గంగాధర్, ఉష ఆలపించారు. వీణాపాణి స్వర హృదయానికి ఏవిఎస్ పులకించిపోయారు. తనకు శస్త్రచికిత్స తర్వాత అందుకున్న శుభాకాంక్షలలో ఇది అపరూపమైనదిగా భావిస్తున్నాననీ, జీవితాంతం ఈ అనుభూతిని పదిలంగా దాచుకుంటాననీ చెప్పి వీణాపాణికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 2008 అక్టోబర్లో ఏవీఎస్కు సర్జరీ జరగగా, మరో ఐదేళ్ల ఆయన జీవించారు. 2013 నవంబర్లో ఆయన కన్నుమూశారు.
Also Read