కాకినాడ పోర్ట్ లో `ఆచార్య`!
on Jul 27, 2021
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న సోషల్ డ్రామా `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని కాకినాడ పోర్ట్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసిందట యూనిట్. సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ పిక్చరైజ్ చేయనున్నారట. నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని టాక్. అంతేకాదు.. ఈ షెడ్యూల్ లో వచ్చే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
కాగా, `ఆచార్య`లో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. `రియల్ హీరో` సోనూ సూద్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో నిన్నటి తరం కథానాయిక సంగీత ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అందాల తార రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరవనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో `ఆచార్య` తెరపైకి వచ్చే అవకాశముందని టాక్.