కరోనా దెబ్బ.. 'ఆచార్య' వెనకడుగు!
on Apr 12, 2021
`ఖైదీ నంబర్ 150` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో జోడీగా సందడి చేయనున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వేసవి కానుకగా మే 13న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందట. ఇంకా చిత్రీకరణ మిగిలి ఉండడంతో పాటు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా `ఆచార్య` మీద పడడంతో.. జూన్ 18న సినిమాని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో యూనిట్ ఉందట. అదే గనుక నిజమైతే.. కాజల్ బర్త్ డే (జూన్ 19)కి ఒక రోజు ముందు `ఆచార్య` ఆగమనం ఉండబోతుందనే చెప్పాలి. మరి.. `ఆచార్య` వాయిదా వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
`ఆచార్య`ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనూ సూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా, సంగీత ప్రత్యేక గీతాల్లో అతిథులుగా అలరించనున్నారు.