దేశపు తొలి ఆస్కార్ అవార్డ్ విజేత భాను అథయ్య కన్నుమూత
on Oct 15, 2020
వ్యక్తిగత విభాగంలో తొలి ఆస్కార్ అవార్డ్ అందుకున్న భారతీయురాలిగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథయ్య కన్ను మూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పిస్తున్నారు. ఇంగ్లీష్ ఫిల్మ్ 'గాంధీ'కి సమకూర్చిన కాస్ట్యూమ్ డిజైనింగ్తో ఆమె ఆస్కార్ అవార్డ్ను అందుకున్నారు.
వయసు సంబంధిత సమస్యల కారణంగా గురువారం ఉదయం కొలాబాలోని నివాసంలో ఆమె మరణించినట్లు భాను అథయ్య కుమార్తె రాధికా గుప్తా మీడియాకు తెలిపారు. ఆమె తేలికపాటి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారనీ, యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్నారనీ రాధిక చెప్పారు. భాను అథయ్య 1929 ఏప్రిల్ 28న కొల్హాపూర్లో జన్మించారు. ఆమె అసలు పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ.
భాను అథయ్య 100కి పైగా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. 1956లో దేవానంద్ మూవీ 'సిఐడి'తో ఆమె తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత స్వర్ణయుగ కాలంలో గురుదత్ 'ప్యాసా', 'సాహెబ్ బీవీ ఔర్ గులాం' లాంటి క్లాసిక్స్కు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఐదు దశాబ్దాలకు మించిన కెరీర్లో అనేక గొప్ప చిత్రాలకు ఆమె పనిచేశారు. ఆమిర్ ఖాన్ 'లగాన్', షారుఖ్ ఖాన్ 'స్వదేశ్' చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఆమే. 'స్వదేశ్' ఆమె చివరి చిత్రం కూడా.
1982లో రిచర్డ్ అటెన్బరో సినిమా 'గాంధీ'తో అకాడమీ అవార్డు తీసుకున్నప్పుడు భాను అథయ్య పేరు ఇంటర్నేషనల్ సినీ యవనికపై మారుమోగింది. ఈ అవార్డును ఆమె జాన్ మోలోతో పంచుకున్నారు. 2010లో ఆమె తన పుస్తకం 'ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్'ను ప్రచురించారు. 2002లో 'లగాన్' సినిమాతో నేషనల్ అవార్డును కూడా ఆమె గెలుచుకున్నారు. 2009లో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డుల ఫెస్టివల్లో లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
కాగా ఆమె 5 డిసెంబర్ 2012 న, తన ఆస్కార్ ట్రోఫీని ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కు తిరిగి ఇచ్చేశారు.
Also Read