చిట్టీల రాణి జంపు జిలానీ...!
on Mar 14, 2014
బుల్లితెర నటి విజయరాణి పలువురు జూనియర్ ఆర్టిస్టులను మోసం చేసి పారిపోయారు. విజయరాణి గతకొంత కాలంగా చిట్టీల పేరుతో పలువురు జూనియర్ ఆర్టిస్టుల నుండి డబ్బులు సేకరించింది. బాగా నమ్మకం కల వ్యక్తిగా, మంచిగా అందరితో మాట్లాడే మనిషిగా నమ్మకం కలిగించడంతో ఎక్కువమంది ఈమె వద్దనే చిట్టీలు వేసారు. అయితే ఆ డబ్బు దాదాపు 8కోట్ల రూపాయల వరకు జమ అవడంతో.. ఇదే సరైన సమయం అని భావించిన విజయరాణి, ఆ డబ్బుతో జంపు జిలానీ.
అయితే కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో ఊరెళ్ళి ఉండవచ్చేమో అనుకొని బాధితులు భావించారు. కానీ ఎంతకీ తన ఆచూకీ లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం విజయరాణి కోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. విజయరాణి ఇలా చేస్తుందని తాము ఊహించలేకపోయామని, పిల్లల భవిష్యత్ కోసం ఆమె దగ్గర చిట్టీలు వేశామని వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.