వేంకటేశాయ చూస్తుంటే లవకుశ గుర్తుకొచ్చింది
on Feb 18, 2017
అక్కినేని నాగార్జున.. హాథీరామ్ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎ.మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' స్పెషల్ షోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు...
"'ఓం నమో వేంకటేశాయ' వంటి అద్భుతమైన భక్తిరస చిత్రాన్ని చూడటం ఆనందంగా వుంది. కె.రాఘవేంద్రరావుగారి సృజనాత్మక శక్తి రమణీయం, కమనీయం. ఒక్కమాటలో చెప్పాలంటే మహాద్భుతాన్ని సృష్టించారు. నేటి తరానికి నాటి పూర్వగాథను తెలియజేశారు. ఏడు కొండలు వెనుక వున్న కథను చక్కగా క్రోడీకరించి అందంగా మలిచారు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తి రస చిత్రాన్ని కొత్త నాగార్జున్ని చూశాం. అలాగే 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో కూడా ఒక కొత్త నాగార్జున కనబడతారు. పాత్రకు సరిపోయేలా, అందులో ఒదిగిపోయి చక్కగా నటించారు.
కె.రాఘవేంద్రరావుగారు తన సృజనాత్మక శక్తితో కలియుగంలో కూడా ఎవరూ వేలెత్తి చూపించలేని గొప్పగా వైకుంఠాన్ని క్రియేట్ చేశారు. అద్భుతమైన గ్రాఫిక్స్. నేటి దర్శకులు ఇలాంటి సినిమాలను చూసి ఎలా తీయాలో తెలుసుకోవాలి. తెలుగువారే కాదు భారతీయులందరూ చూడాల్సిన గొప్ప భక్తి చిత్రం. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాను చూస్తుంటే సీనియర్ ఎన్.టి.ఆర్గారు నటించిన 'లవకుశ' చిత్రం గుర్తుకొస్తుందని నేను నిర్మాత మహేష్రెడ్డికి చెప్పాను. సినిమా అంత బాగుంది."