ఉపేంద్ర దర్శకత్వంలో చిరంజీవి!
on Mar 12, 2019
ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి చిరంజీవి, ఉపేంద్ర కాంబినేషన్లో సినిమాను ప్రేక్షకులు చూసేవారు. జస్ట్ మిస్ అయ్యింది. నిజమే... ఉపేంద్ర దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా నిర్మించాలని అశ్వనీదత్ ప్లాన్ చేశారు. బెంగళూరు నుంచి ఉపేంద్రను హైదరాబాద్ కి పిలిపించారు. చిరంజీవి కోసం కథ రాయమని అడిగారు. ఉపేంద్ర కూడా ఒక 15మంది బ్యాచ్ వేసుకుని దిగారు. కమర్షియల్ ఫార్ములాకు బిన్నంగా సరికొత్త కమర్షియల్ ఫార్మాట్ లో ఒక కథ చెప్పారట. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి చెప్పారు. ఆయనకు ఎలా తెలుసు? అంటే... అప్పట్లో వైవియస్ చౌదరి వైజయంతి మూవీస్ సంస్థలో కో డైరెక్టర్. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా 'ఐ లవ్ యు' టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సందర్భంగా పాత సంగతులను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, ఉపేంద్ర కాంబినేషన్లో మిస్ అయిన సినిమా గురించి చెప్పారు.