'బహుబలి' ఓవర్ సీస్ రైట్స్ అన్ని కోట్లా..?
on Aug 11, 2014
టాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'బహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి భారీ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. దగ్గుబాటి రాణా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్ సీస్ రైట్స్ని బ్లూ స్కై వారు 9 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ 9 కోట్లు తొలి భాగానికే మాత్రమేనట. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్ద ఆర్కా మీడియా సంస్ద నిర్మిస్తోంది. కె. రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లోకి అనువదించి ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇందులో నటిస్తున్న తారాగణం అంతా కత్తి యుద్దం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ఈ చిత్రంలో ప్రతిదీ సంచనలమే. షూటింగ్ మొదలైనప్పటి నుండి రోజుకో వార్తతో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నెగిటివ్ రోల్లో కనిపించనుంది. అన్నదమ్ములుగా రాణా, ప్రభాస్లు కనిపిస్తారు. వీరిద్దరి మధ్య రాజ్యం కోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.