'అసురన్' తెలుగు రీమేక్లో వెంకటేశ్
on Oct 25, 2019
ధనుష్ టైటిల్ రోల్ చేయగా వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన తమిళ సినిమా 'అసురన్' ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసి, ధనుష్ కెరీర్ బెస్ట్ ఫిలింగా నిలిచింది. ఇటీవల ఈ మూవీని చూసి సూపర్ స్టార్ మహేశ్ సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ముగ్గురు పిల్లల తండ్రిగా ధనుష్ ప్రదర్శించిన నటనను అందరూ మెచ్చారు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ధనుష్ కేరెక్టర్ను తెలుగులో సీనియర్ స్టార్ వెంకటేశ్ పోషించనున్నారు.
'అసురన్'ను నిర్మించిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్. థాను, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్బాబు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. తమిళంలో ఏ సినిమా అయినా ఆడిందంటే, అందులో పాత్ర తన వయసుకు తగ్గదైతే చెయ్యడానికి వెంకటేశ్ ఎప్పుడూ ముందుంటున్నారు. 'దృశ్యం', 'గురు' సినిమాలు ఆ కోవలోనివే కావడం గమనార్హం. ఇప్పుడు మరోసారి అదే తరహాలో 'అసురన్' కేరెక్టర్ను తెలుగులో చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.