అవే పోలికలు: అప్పుడు 'ఒక్కడు'.. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'..
on Oct 1, 2019
కొద్ది రోజుల క్రితం 'కొండారెడ్డి బురుజు' వార్తల్లో నిలిచింది. పొలిటికల్గానో, లేక కల్చరల్గానో, లేక గొడవల కారణంగానో కాదు. ఒక సినిమా కారణంగా. ఆ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కర్నూలు సిటీకి గుండెకాయలాంటి ఆ కోట బురుజు హైదరాబాద్కు తరలి వచ్చేసిందనేది ఆ వార్తలోని అంశం. తరలి రావడమంటే.. దానికదే రావడం కాదు. దాని 'రెప్లికా' వచ్చిందన్న మాట. అచ్చం.. కొండారెడ్డి బురుజును తలపించే బురుజును రామోజీ ఫిల్మ్ సిటీలో 'సరిలేరు నీకెవ్వరు' ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ సృష్టించాడు.
నైట్ ఎఫెక్టులో ఆ బురుజు విద్యుత్ కాంతులతో వెలుగుతుంటే.. దాని సమీపంలో చీకట్లో నిల్చొని నడుము కింద స్టైల్గా రెండు చేతులూ పెట్టుకొని బురుజునే చూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ను వెనుక నుంచి చూపిస్తున్న ఫొటో.. సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో మనం చూశాం. మహేశ్కూ, కొండారెడ్డి బురుజుకూ మధ్య బంధం ఇప్పటిది కాదు. 'ఒక్కడు' మూవీ కాలం నాటిది.
ఆ మూవీ 2003లో సంక్రాంతికి విడుదలై మహేశ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అందులో నిజమైన కొండారెడ్డి బురుజు దగ్గర కథానుసారం సన్నివేశాలు తీశాడు ఆ మూవీ డైరెక్టర్ గుణశేఖర్. ఆ సినిమాలో ఓబుల్ రెడ్డి అనే రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కబడ్డీ ఆడేందుకు కర్నూలుకు వచ్చిన అజయ్ అనే కుర్రాడు ఓబుల్ రెడ్డితో తలపడే సన్నివేశాల్లో కొండారెడ్డి బురుజు కూడా ఒక పాత్రగా కనిపిస్తుంది. అజయ్ కేరెక్టర్లో మహేశ్ బ్రహ్మాండంగా రాణించి తన ఫ్యాన్ బేస్ను బాగా పెంచుకున్నాడు.
పదిహేడేళ్ల తర్వాత మళ్లీ కొండారెడ్డి బురుజు దగ్గర నటిస్తున్నాడు మహేశ్. అయితే ఇప్పుడు నిజమైన బురుజు దగ్గర షూటింగ్కు అనువైన వాతావరణం లేకపోవడం, షూటింగ్కు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో నిజమైన బురుజు ఎలా ఉంటుందో, సేమ్ టు సేమ్ అలాంటిదాన్నే ఎ.ఎస్. ప్రకాశ్ సృష్టిస్తే, అక్కడ మహేశ్పై డైరెక్టర్ అనిల్ రావిపూడి సన్నివేశాలు తీస్తున్నాడు.
'ఒక్కడు' మూవీకి, 'సరిలేరు నీకెవ్వరు' మూవీకి పోలిక ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రమే కాదు, మరికొన్ని పోలికలూ ఉన్నాయి. ఈ మూవీలోనూ ప్రకాశ్ రాజ్ ఉన్నాడు. అంతేకాదు, ఇందులోనూ ఆయన రాయలసీమ మనిషిగా కనిపించనున్నాడు. కాకపోతే, అందులో ఫ్యాక్షనిస్టు కాస్తా, ఇందులో పొలిటికల్ లీడర్ అయ్యాడు. ప్రజా సంక్షేమ పార్టీ లీడర్ ఎద్దుల నాగేంద్ర అనే కేరెక్టర్ను ఆయన చేస్తున్నాడు.
మహేశ్ చేస్తున్న కేరెక్టర్ పేరు మేజర్ అజయ్ కృష్ణ అని ఎప్పుడో డైరెక్టర్ రివీల్ చేశాడు. అంటే రెండు సినిమాల్లోనూ హీరో కేరెక్టర్ పేరు అజయ్! 'ఒక్కడు'లో హీరోయిన్ను రక్షించడానికి తండ్రితోటే టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడతాడు అజయ్. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే టైప్ గేమ్ ను రాజేంద్రప్రసాద్ కేరెక్టర్తో ఆడతాడు.
సోషల్ మీడియాలో లీకైన ఒక ఫొటోలో మహేశ్ ట్రాక్టర్ నడుపుతుంటే, అతనికి చెరోవైపు విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కూర్చొని ఉన్నారు. దాన్నిబట్టి ఆ ఇద్దరూ భార్యాభర్తలుగా.. అదే సమయంలో మహేశ్ తల్లిదండ్రులుగా కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఈ సినిమాలోనూ తండ్రీకొడుకుల కేరెక్టర్ల మధ్య దాగుడుమూతలాట ఉంటుందన్న మాటే. అది హీరోయిన్ రష్మికా మందన్న కోసమే అయితే.. 'ఒక్కడు'తో ఈ మూవీకి ఇంకో పోలిక ఉన్నట్లే! అంతేనా.. 'ఒక్కడు' తరహాలోనే, ఇది కూడా సంక్రాంతికి వస్తోంది.
అయితే 'ఒక్కడు' స్టోరీ బ్యాక్డ్రాప్కూ, 'సరిలేరు నీకెవ్వరు' స్టోరీ బ్యాక్డ్రాప్కూ ఏ మాత్రం సంబంధం ఉండదని అనిల్ రావిపూడి చెప్తున్నాడు. పోలికల విషయం పక్కనపెడితే, 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో మహేశ్ మునుపటి హీరోయిన్లు ఇద్దరు కనిపించనున్నారు. మహేశ్ కేరెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్లో 'ఆగడు' నాయిక తమన్నా కనిపించనుంటే, ఒక ఐటం సాంగ్లో 'మహర్షి' నాయిక పూజా హెగ్డే మెరుపులా డాన్స్ చేయనున్నది. ఇలా.. అనేకానేక ఆకర్షణలతో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహేశ్.. ఈ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.