'అల.. వైకుంఠపురములో' బన్నీ టాప్ ఫామ్ లోకి వస్తాడా?
on Sep 30, 2019
'అల.. వైకుంఠపురములో..' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టి తన మాస్ స్టామినా ఏమిటో చూపించాలని తహతహ లాడుతున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఆయన మునుపటి సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా బోల్తా కొట్టడం. ఎక్కువ ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్ సూర్య పాత్రలో తన నటనను అందరూ ప్రశంసించినా, ఆ సినిమా డిజాస్టర్ కావడం బన్నీని బాగా డిజప్పాయింట్ చేసింది. కథా కథనాలు ఆకర్షణీయంగా లేకపోవడం వల్లే ఆడియెన్స్ ఆశించిన రీతిలో 'నా పేరు సూర్య' సినిమాను ఆదరించలేదని విశ్లేషకులు తేల్చారు.
2014లో వచ్చిన 'రేసుగుర్రం', 2016లో రిలీజైన 'సరైనోడు' సినిమాలు బ్లాక్బస్టర్ హిట్టయి మాస్లో బన్నీ ఇమేజ్ను బాగా పెంచాయి. 2017లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' మూవీ సైతం 'సరైనోడు' రేంజిలో కలెక్షన్లు వసూలు చేసినా భారీ రేట్లకు అమ్మడం వల్ల బయ్యర్లు లాభాలు పొందలేకపోయారు. ఆ మూవీని యావరేజ్గానే విశ్లేషకులు పరిగణించారు. దాని తర్వాత వచ్చిన 'నా పేరు సూర్య' మూవీ వసూళ్లు 50 కోట్ల రూపాయల షేర్ను దాటినా డిజాస్టర్ అయ్యింది.
ఈ నేపథ్యంలో దాదాపు ఒన్ ఇయర్ గ్యాప్ తీసుకొన్నాడు బన్నీ. ఈసారి సీరియస్ సబ్జెక్ట్ కాకుండా ఎంటర్టైనర్తో ఆడియెన్స్ ముందుకు రావాలని ఆయన డిసైడ్ అయ్యాడు. అందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ కరెక్ట్ ఛాయిస్ అనుకున్నాడు. అదివరకు వాళ్లిద్దరి కాంబినేషన్లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. యాక్షన్ ఎంటర్టైనర్ అయిన 'జులాయి' హిట్టవగా, ఫాదర్ సెంటిమెంట్ మేళవించిన ఫ్యామిలీ డ్రామా 'సన్నాఫ్ సత్యమూర్తి' యావరేజ్గా ఆడింది. స్టోరీ టెల్లర్గా, డైరెక్టర్గా త్రివిక్రమ్ కి ఉన్న పేరువల్ల, ఆయనతో అదివరకే రెండు సినిమాలు చేసిన అనుభవం వల్లా ఆయనతో కలిసి మరోసారి జర్నీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు బన్నీ.
వాళ్లిద్దరి మధ్యా చాలా రోజుల పాటు స్టోరీ డిస్కషన్స్ నడిచాయి. ఎంటర్టైనింగ్ స్టోరీతో త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్కు ఒకరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 'అత్తారింటికి దారేది', 'అ ఆ', 'అరవింద సమేత' టైటిల్స్ తరహాలో ఈ సినిమాకు 'అల.. వైకుంఠపురములో' అనే భిన్న తరహా టైటిల్ పెట్టాడు త్రివిక్రమ్. ఒక్క 'అజ్ఞాతవాసి' మినహా 'అ' అక్షరంతో మొదలయ్యే టైటిల్ కూడా త్రివిక్రమ్ కు కలిసి వచ్చింది. డైరెక్టర్గా త్రివిక్రమ్ రెండో సినిమా 'అతడు' అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టైటిల్తో వైకుంఠపురంలో ఏం జరిగిందనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు త్రివిక్రమ్.
నెల రోజుల క్రితం 'ఫస్ట్ గ్లింప్స్' పేరుతో విడుదల చేసిన వీడియోకు ఎంత బాగా రెస్పాన్స్ వచ్చిందో, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' ఫుల్ సాంగ్ వీడియోకు అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది. తమన్ స్వరాలు కూర్చిన ఈ పాటను సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తనకే సాధ్యమైన పాదాలతో సుమధురంగా రాశారు. సిద్ శ్రీరాం గళంలో ఈ సాంగ్ యూత్ను బాగా అలరిస్తోంది. స్టేజిపై తమన్ పియానో, అతని బృందం ఆర్కెస్ట్రా వాయిస్తుండగా, సిద్ శ్రీరాం పాడుతున్న ఈ వీడియోకు రెండు రోజుల్లోనే యూట్యూబ్లో 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయంటేనే, దాని హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సీతారామశాస్త్రి రాసిన అందమైన లైన్స్ను సిద్ శ్రీరాం సక్రమంగా పలకలేదని ఆ సాంగ్ విన్న ఎవరికైనా అర్థమవుతుంది. తమన్ ఇచ్చిన బాణీలకు తగ్గట్లు పాడే ప్రయత్నంలో సాహిత్యాన్ని పాడు చెయ్యకూడదు కదా!
సరే.. ఆ విషయం అలా ఉంచితే.. 'అల.. వైకుంఠపురంలో' మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనేది నిజం. 'దువ్వాడ జగన్నాథం' మూవీ తర్వాత బన్నీ, పూజా హెగ్డే మరోసారి ఇందులో పెయిర్గా నటిస్తున్నారు. ఆ జంట ఎంత చక్కగా ఉందో ఇదివరకే మనం చూశాం కాబట్టి, ఈ సినిమాతో వాళ్లు ప్రేక్షకుల్ని తమ కెమిస్ట్రీతో మరింత అలరిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే మునుపటి సినిమాలో కంటే ఈ మూవీలో వాళ్ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి.
చాలా కాలం తర్వాత బాలీవుడ్ తార టబు తెలుగులో నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సచిన్ ఖడేకర్, సముద్ర కని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, మురళీశర్మ తదితర పేరుపొందిన నటీనటులు భాగమవడంతో ట్రేడ్ సర్కిల్స్లో ఈ మూవీకి క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతి సందర్భంగా 2020 జనవరి 12న రిలీజవుతున్న 'అల.. వైకుంఠపురములో' మూవీతో అల్లు అర్జున్ మునుపటి టాప్ ఫామ్ ను అందుకుంటాడని ఆయన ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి బన్నీ ఏం మాయ చేస్తాడో చూడాలి.