'సాహో' బాక్సాఫీస్: ప్రెజెంట్ టాప్ 2 గ్రాసరే కానీ..
on Sep 6, 2019
ప్రభాస్ టైటిల్ రోల్ చేయగా, దేశమంతా ఎంతో క్రేజ్తో ఎదురుచూసిన 'సాహో' రిలీజై వారం దాటింది. హిందీ, తమిళ వెర్షన్లలోనూ ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. తమిళ వెర్షన్ కలెక్షన్లు అత్యంత నిరాశాజనకంగా ఉండగా, హిందీ వెర్షన్ కలెక్షన్లు బెటర్గా ఉన్నాయి. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, ఫస్ట్ వీక్ కలెక్షన్ పరంగా టాలీవుడ్ టాప్ 2 గ్రాసర్గా నిలిచింది 'సాహో'.
శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించగా, సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ 74 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. తొలి వారానికి సంబంధించి టాలీవుడ్లో ఇవి సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్. ఫస్ట్ ప్లేస్లో ప్రభాస్ మునుపటి మూవీ 'బాహుబలి 2' ఉంది. దానికి ఫస్ట్ వీక్ వచ్చిన షేర్ 117 కోట్ల రూపాయలు. అయితే ఇంత కలెక్ట్ చేసినా 'సాహో' సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో బయ్యర్లలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ అనూహ్యంగా పడిపోయిందనీ, ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కంటిన్యూ అయితే నైజాం ఏరియాలో, రాయలసీమలో 'సాహో' బయ్యర్లు 10 కోట్ల రూపాయల చొప్పున నష్టపోయే ప్రమాదం ఉందనీ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలోనూ ఏ ఒక్క బయ్యరూ సేఫ్ జోన్లో వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.
కలెక్షన్ ట్రెండ్ని ఒకసారి పరిశీలిస్తే, రిలీజైన ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల షేర్ రాగా, తర్వాత ఆరు రోజుల్లో వచ్చిన షేర్ వాల్యూ 38 కోట్లు. అందులోనూ ఆరో రోజు 1.72 కోట్ల షేర్ రాగా, ఏడో రోజు 1.34 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సాహో' ప్రి బిజినెస్ వాల్యూ 122 కోట్ల రూపాయలని అంచనా. ఆ ప్రకారం చూస్తే ఇంకా 48 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది. ప్రెజెంట్ కలెక్షన్ ట్రెండ్ ప్రకారం అది రికవర్ అయ్యే అవకాశాలు లేవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అలాగే కర్ణాటకలో తెలుగు వెర్షన్ను ఔట్ రైట్కు కొన్న బయ్యర్ భారీగా నష్టపోనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 28 కోట్ల రూపాయలకు కొన్న ఆ సినిమాకు 20 కోట్ల రూపాయల షేర్ రావడం కూడా గగనమేనని సమాచారం. రాబోయే రోజుల్లో ఏ ఏరియాలో 'సాహో' వల్ల బయ్యర్లు ఎంత లాస్ అయ్యారనే లెక్కలు చెప్పుకోవాల్సి వస్తుందని వాళ్లంటున్నారు. ఆ లాస్ సాధ్యమైనంత వరకు తగ్గాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంటోంది.
Also Read