వైరల్ అయిన 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ పోస్టర్
on Sep 1, 2019
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో...'. ఇటీవలే టైటిల్ లోగోను విడుదల చేసిన నిర్మాతలు తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్లో బన్నీ కనిపించిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ఆకాశ హర్మ్యం, పక్కనే అతి ఖరీదైన కారు, దాని పక్కనే ఒక చిన్న స్టూల్పై ఒక కాలు మడిచి స్టూల్పై పెట్టి, రెండో కాలుని కింద ఫ్లోర్పై పెట్టి స్టైల్గా కూర్చున్నాడు బన్నీ. అంతేనా.. సూటు వేసుకొని ఉన్న అతను నోట్లో బీడీ పెట్టుకొంటే, దాన్ని అంటించడానికి సెక్యూరిటీ గార్డ్ అగ్గిపుల్ల వెలిగించే పనిలో ఉన్నాడు. ఈ లుక్ స్వల్ప కాలంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'అల.. వైకుంఠపురములో...' చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరోగా ఇది బన్నీకి 19వ సినిమా కాగా, త్రివిక్రం డైరెక్షన్లో మూడో సినిమా. ఇది వరకు ఆ ఇద్దరి కాంబినేషన్లో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీస్ వచ్చాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల 'ఫస్ట్ గ్లింప్స్' పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో పనివాడి తరహాలో కనిపించిన అర్జున్ "ఇవ్వలా.. వచ్చింది" అంటూ చెప్పిన డైలాగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
పూజా హెగ్డే నాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. 2020 సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టబు ఒక కీలక పాత్ర చేస్తోన్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, సముద్ర కని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ వంటి ఉద్ధండులు నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు.