ఆ విషయంలో ప్రభాస్ తప్పు చేశాడా?
on Aug 31, 2019
'బాహుబలి' 1, 2 సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీతనంలో ఆ సినిమాలకు ఏ మాత్రం తగ్గకూడదనే ఆలోచనతోటే 'సాహో' నిర్మాతలు, రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టే సాహసానికి పూనుకున్నారని అనుకున్నా, ప్రభాస్ ఎందుకు వాళ్లను వారించలేక పోయాడనేది ప్రశ్న. 'బాహుబలి' వెనుక రాజమౌళి వంటి గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. మరి 'సాహో' వెనుక ఎవరున్నారు? రాజమౌళికి సుజిత్ ఏ రకంగా చూసినా మ్యాచ్ కాడు. అదివరకు అతను చేసింది ఒకే ఒక సినిమా. అది శర్వానంద్తో తీసిన 'రన్ రాజా రన్'. దాన్ని తీసిన ప్రొడ్యూసర్లే, ఇప్పుడు 'సాహో'నీ తీశారు. ఆలోచిస్తే, వాళ్లు సుజిత్ను కాకుండా ప్రభాస్ను నమ్మే, 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెట్టి 'సాహో'ను నిర్మించారని తెలుస్తోంది.
'బాహుబలి'తో ప్రభాస్కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది కాబట్టి, హిందీ, తమిళంలోనూ ఒకేసారి ప్రొడ్యూస్ చేసి, రిలీజ్ చేస్తే, వర్కౌట్ అవుతుందని వాళ్లు భావించి ఉండాలి. కానీ వాళ్లు ఓవర్లుక్ చేసిన విషయం.. ప్రభాస్ కేవలం నటించగలడే కానీ, సినిమా తీసేది డైరెక్టరే. అతను తీసిన మూవీకి ప్రభాస్ ఆకర్షణ మాత్రమే అవగలడు. తన స్టార్ ఇమేజ్తో దానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తీసుకు రాగలడు. కానీ తర్వాత సినిమా నిలబడేది.. ఆ సినిమా ఎలా ఉందనే దానిపైనే. ఇవాళ్టి రోజుల్లో సినిమా ఎలా ఉందనే టాక్ క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతోంది. నెగటివ్ టాక్ వచ్చిందంటే సినిమా రిలీజైన సాయంత్రం నుంచే కలెక్షన్లు పడిపోతున్న సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అందుకే 'సాహో'కు వచ్చిన నెగటివ్ టాక్.. ఫస్ట్ షో పూర్తయిన సెకన్లలోనే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిపోయింది. దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లవుతుంది?
ప్రభాస్ ముందుగానే జాగ్రత్త పడాల్సింది. తనను నమ్మి నిర్మాతలు కోట్లు వెదజల్లుతున్నప్పుడు, తన ఇమేజ్ను నమ్మి డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లకు సినిమాని కొంటారనే విషయం తెలిసినప్పుడు.. వాళ్లు సేఫ్జోన్లో ఉండేలా చూసుకోవాల్సింది. ఈ విషయంలో ప్రభాస్ అలసత్వం వహించడం వల్ల ఏం జరగనుందో రానున్న రోజుల్లో స్పష్టం కానున్నది. డై హార్డ్ ఫ్యాన్స్కైనా కావాల్సింది, తమ హీరో తమల్ని అలరించడంతో పాటు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు చేకూర్చడమే కదా!