'బాహుబలి' ఒత్తిడిని తట్టుకొని 'సాహో' చేశాం: ప్రభాస్
on Aug 12, 2019
'బాహుబలి' తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో తమ యూనిట్పై ఒత్తిడి ఉందనీ, అందుకే ప్రేక్షకులు, అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి రాత్రి పగలు కష్టపడి, కాస్త సమయం తీసుకుని 'సాహో' చేశామనీ చెప్పారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన 'సాహో' సినిమా ఆగస్ట్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్కు పరిచయమవుతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాస్ మాట్లాడారు. "ట్రైలర్కి చాలా హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూడగానే మెగాస్టార్ చిరంజీవిగారు ట్రైలర్ బావుందంటూ మెసేజ్ చేశారు. నాకు షాకింగ్గా అనిపించింది. ఆయనతో ఫోన్లో మాట్లాడాను. అదొక ఎక్సార్డినరీ ఫీలింగ్. గూస్బంప్స్ వచ్చాయి" అని ఆయన చెప్పారు. తనకు క్రికెట్లో డిఫెన్స్ ఆడటం తెలియదనీ, లాగి కొట్టడమే తెలుసనీ అన్నారు "తగిలితే సిక్సరే. సిక్సర్ డైలాగ్కి ట్రైలర్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్వాలిటీ కోసం సుజిత్ అతని వయసుకు మించి కష్టపడ్డాడు. దర్శకుడుగా రెండో సినిమాకే ఇంతలా వర్క్ చేయడం అంత సులభమేమీ కాదు. నేను, నిర్మాతలు ఒత్తిడి ఫీలయ్యాం కానీ సుజిత్ ఒక్కసారి కూడా సెట్లో కోప్పడటం చూడలేదు. ఉదాహరణకు సినిమాలో ఒక సీన్ ఐదు వేరియేషన్స్తో వస్తుంది. చాలా టఫ్ సీన్. కథలో 8 లేయర్స్ ఉంటాయి. అలాంటి సన్నివేశాన్ని సుజిత్ తొలి రోజు చిన్న కరెక్షన్ లేకుండా తీయడం గొప్పగా అనిపించింది. రీషూట్స్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. అప్పుడే తనపై నమ్మకం కలిగింది" అని సుజిత్ను ప్రశంసించారు ప్రభాస్.
శ్రద్ధ సూపర్బ్ యాక్టర్ అనీ, యాక్షన్ పార్ట్ కోసం తనతో పాటు శ్రద్ధ కూడా చాలా రిహార్సల్ చేసిందనీ ఆయన తెలిపారు. "తెలుగులో తన డైలాగులను తనే చెప్పుకుంది. నేను, సుజిత్, టీమ్ మెంబర్స్ షాకయ్యాం. 'సాహో'లో మంచి ప్రేమకథ ఉంటుంది. ఇదొక యాక్షన్ లవ్స్టోరీ అని చెప్పొచ్చు. శ్రద్ధాది అంత ముఖ్యమైన పాత్ర. 'ఆషికీ 2' వంటి లవ్ స్టోరీలో నటించిన శ్రద్ధ నటించిన యాక్షన్ సినిమాను చూడటానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు" అని చెప్పారు ప్రభాస్.