త్రివిక్రమ్ అంటే నాగార్జునకు కోపమా?
on Aug 7, 2019
స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాల దర్శకుడు విజయ భాస్కర్ కావచ్చు. కానీ, ఆ చిత్రాల రచయిత త్రివిక్రమ్ అనే సంగతి అందరికీ తెలిసినదే. త్రివిక్రమ్ పంచ్ డైలాగులే ఆ చిత్రాలకు ప్రాణం. పరిశ్రమ ప్రముఖులే కాదు ప్రేక్షకులు కూడా ఆయన చిత్రాలు విజయాలు సాధించడానికి కారణం త్రివిక్రమ్ రచన అని చెబుతారు. అటువంటి త్రివిక్రమ్ ప్రతిభను నాగార్జున గుర్తించడం లేదా? లేదా తక్కువ చేస్తున్నారా? ఇప్పుడిదే అనుమానం చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కలుగుతోంది. 'మన్మథుడు 2' పేరుతో నాగార్జున నటించిన, నిర్మించిన సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. త్రివిక్రమ్ రచనతో విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన మన్మథుడు చిత్రానికి ఇది సీక్వెల్ కాదు. కానీ, అదే పేరుతో వస్తుంది కనుక మన్మథుడు 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున మన్మథుడిని గుర్తు చేసుకున్నారు. విజయ భాస్కర్ గురించి మాట్లాడారు. మాట వరసకైనా త్రివిక్రమ్ పేరు తీయలేదు. మాటల మాంత్రికుణ్ణీ అలా ఎలా మరిచిపోతారని చాలామంది అనుకున్నారు. సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. 'మన్మథుడు 2' విడుదల సందర్భంగా మీడియాకు నాగార్జున ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చారు.
త్రివిక్రమ్ పేరును ఎలా మరిచిపోయారనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. "నాకు కథ చెప్పింది విజయ భాస్కర్. పంచ్ డైలాగులు చెప్పింది కూడా ఆయనే. డైలాగులు ఎలాగో చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన పేరు చెప్పాను" అని నాగార్జున సమాధానం ఇచ్చారు. ఆ విషయంపై మరో ప్రశ్న వెయ్యబోతుంటే ఆయన సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. ఇతర ప్రశ్నలపై దృష్టి పెట్టారు. రచయితలు అందరూ హీరోల దగ్గరకు వెళ్లి కథలు చెప్పాలని రూలేం లేదు. నాగార్జున చెప్పినట్టు విజయ భాస్కర్ ఆయనకి కథ చెప్పి ఉండొచ్చు. హీరో రచయితల మధ్య సమావేశం జరగలేదని అనుకుందాం. అయితే... మన్మథుడికి నాగార్జున నిర్మాత కూడా. ఆ చిత్రానికి త్రివిక్రమ్ కోటి రూపాయల పారితోషికం అందుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. హీరో గా కాకపోయినా డబ్బులు ఇచ్చిన నిర్మాత గా అయిన త్రివిక్రమ్ పేరు మర్చిపోవడం ఏమిటో మరి? నాగార్జున కావాలని త్రివిక్రమ్ పేరును సైడ్ లైన్ చేస్తున్నారని కొందరి ఫీలింగ్. త్రివిక్రమ్ అంటేే నాగార్జునకు ఎందుకంత కోపమో?