వాళ్లకు ప్రభాస్ థాంక్స్ చెప్పాడు!
on Aug 6, 2019
ఆకాశాన్ని చుంబిస్తున్న అంచనాల మధ్య ప్రభాస్ సినిమా 'సాహో' ఆగస్ట్ 30న విడుదలవుతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నాయికగా నటించింది. మొదట ఆగస్ట్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'సాహో'ను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ వీఎఫ్ఎక్స్ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో రిలీజ్ డేట్ను నెలాఖరుకు జరిపారు. దాంతో పలు సినిమాల నిర్మాతలు ఇబ్బందులకు గురయ్యారు.
అదివరకు ఆగస్ట్ నెలాఖరున తీసుకు రావాలనుకున్న సినిమాల్ని కొందరు ముందుకు జరిపితే, కొందరు వెనక్కి జరిపారు. ఉదాహరణకు 'రణరంగం', 'ఎవరు' సినిమాలు ఈ నెల 23న రావాల్సింది. 'సాహో' 30న వస్తుండటంతో తమ సినిమాల్ని రెండో వారమే థియేటర్ల నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ సినిమాల విడుదలను ముందుకు జరిపి, ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇక నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాని ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా విడుదలను సెప్టెంబర్ 13కి జరిపారు.
ఇలా తమ సినిమా వల్ల ఇతర హీరోల సినిమాలు ఇబ్బంది పడటంతో ప్రభాస్ స్పందించాడు. "సాహో మూవీ ఆగస్ట్ 30న రావడానికి తగ్గట్లుగా తమ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేసిన నటులకు, నిర్మాతలకు, దర్శకులకు ధన్యవాదాలు. వాళ్లకు 'సాహో' బృందం కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. వాళ్ల సినిమాలు బాగా ఆడాలని మేం కోరుకుంటున్నాం" అని తన ఇన్స్టాగ్రాం పేజీ ద్వారా తెలిపాడు ప్రభాస్.