సాహో' పోస్టర్స్ కాపీనా? దర్శకుడి మాటేమిటి?
on Aug 3, 2019
నెట్టింట్లో కుర్రాళ్లు మహా చురుగ్గా ఉంటున్నారు. కాపీ రాయుళ్లు ఇలా సినిమాలను విడుదల చేయడం ఆలస్యం... అలా ఏ సినిమా నుండి కాపీ కొట్టారో చెప్పేస్తున్నారు. ఆఖరికి పోస్టర్లను కాపీ కొట్టినా ఊరుకోవడం లేదు... ఒప్పుకోవడం లేదు. రెండు పోస్టర్లను పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 'సాహో ' పోస్టర్లపైనా ఇటువంటి రచ్చ నడిచింది. 'ఏ చోట నువ్వున్నా' పాట విడుదలైన సందర్భంగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు సుజీత్ కాపీ పోస్టర్స్ కామెంట్స్ పై స్పందించారు. "సాహో పోస్టర్స్ హాలీవుడ్ సినిమా పోస్టర్స్ కి కాపీ అని గాసిప్స్ వచ్చాయి. అది ఏ సినిమా పోస్టర్స్ కి కాపీనో చెబితే నేను క్లారిటీ ఇస్తా" అని సుజీత్ చెప్పారు. 'సాహో'కి హీరోగా ప్రభాస్ ను తాను ఎంపిక చేసుకోలేదని, ప్రభాసే 'సాహో' చిత్రానికి దర్శకుడిగా తనను ఎంపిక చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభాస్ వంటి స్టార్ ను ఎంపిక చేసుకునే స్థాయిలో తాను లేనన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం కావడం వల్లే సినిమా విడుదల ఆలస్యమైందన్నారు. ఇంకా సుజీత్ మాట్లాడుతూ "అందరూ అనుకుంటున్నట్టు సినిమా ఆలస్యం కాలేదు. 'బాహుబలి 2'తో టీజర్ విడుదల చేయడంతో ఎప్పుడో సినిమా మొదలైందని అనుకుంటున్నారు. కానీ, అప్పుడు సినిమా స్టార్ట్ చేయలేదు. మేం ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ తీసుకున్నాం. అందువల్ల, బడ్జెట్ కూడా కంట్రోల్ అయింది" అని అన్నారు.