నాన్నగారిపై పొగడ్తలు వద్దు: రామ్చరణ్
on Jan 29, 2019
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రామ్ చరణ్ నిర్మిస్తున్న తాజా సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో పాటలు అన్నిటికీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అభినందించిన చిరంజీవి ఈ విషయం వెల్లడించారు. 'సైరా'లో పాటలకు సిరివెన్నెలకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు. 'సైరా' పాటల గురించి చిరంజీవి మాట్లాడుతూ "సిరివెన్నెలగారు ఇప్పటికి రెండు పాటలు పూర్తి చేశారు. విజువల్స్ లేకుండా పాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోంది. ఈ సినిమాతో ఆయనకు కచ్చితంగా నేషనల్ అవార్డు రావాలి. వస్తుందని నమ్ముతున్నా. 'సైరా' పాటల విషయంలో ఇటీవల ఓ గమ్మతైన విషయం చోటు చేసుకుంది. ఓ శక్తిమంతమైన పాటలో 'చిరంజీవి' అని సిరివెన్నెలగారు రాశారు. 'నాన్నగారి గురించి మనమే పొగిడినట్టు ఉంటుందేమో' అని రామ్ చరణ్ అన్నాడు. చిన్న కుర్రాడు నాకు చెప్పడం ఏంటని శాస్త్రిగారు అనుకోకుండా, ఆత్మస్తుతి వద్దన్న చరణ్ సంస్కారాన్ని మెచ్చుకున్నారు. నా పేరు పాట రాయాలని సవాల్ గా తీసుకుని 'మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా...' అని రాశారు" అన్నారు.