నేను-కేటీఆర్ బెంచ్ మేట్స్ః మెగాస్టార్
on Dec 27, 2018
`నేను అనుకున్నదానికన్నా `వినయ విధేయ రామ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇంత వైబ్రంట్ ఉందంటే కారణం అభిమానుల కేరింతలు, ఉత్సాహమే. ఇవే నేను ఎప్పుడూ కోరుకునేదని`` అన్నారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోన్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..`` నన్ను లైఫ్ లో ఏం సాధించావు అంటే ఒకటి రామ్ చరణ్ , రెండోది కోట్లాది మంది అభిమానులు అభిమానం అని గర్వంగా చెప్పగలను. ఎప్పటికీ తరగనిది మీ అభిమానం. ఇది గుండె లోతుల్లో నుంచి వచ్చే మాట. రాజకీయాల్లోంచి వెనక్కి వచ్చాక మీ అభిమానం ఎలా ఉంటుందా? అనే సందేహం ఉండేది. కానీ `ఖైదీ నెంబర్ 150` సూపర్ సక్సెస్ చేసి మీ అభిమానం నా పై ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపించారు.
ఇక కేటీఆర్ గారి రాకతో ఈ ఫంక్షన్ కి నిండుదనం వచ్చింది. మేమిద్దరం ఒకే బెంచ్ మేట్స్. ఒకే టైములో మేమిద్దరం ఎమ్మేల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టాం. రంగస్థలం సినిమా తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తూ బావుటుంది అని ఆలోచిస్తోన్న తరుణంలో అన్ని రకాల చిత్రాలు ఈ మధ్య కాలంలో చేశావు..ఒక మాస్ మిస్సవుతుందని వాళ్లని అలరించేలా సినిమా చేస్తే బావుంటుందనీ, అది కూడా బోయపాటితో అయితే బావుంటుందనీ చెప్పాను. ఆ సమయంలో `వినయ విధేయ రామ` లైన్ చెప్పాడు బోయపాటి. హీరో పాత్ర వినగానే నాకు `గ్యాంగ్ లీడర్` లో నా పాత్ర గుర్తుకొచ్చింది. సినిమా రష్ చూశా అద్భుతంగా వచ్చింది. బోయపాటి అద్భుతంగా చరణ్తో చేయించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
దానయ్య ఈ ఏడాది `భరత్ అనే నేను` తో పెద్ద సక్సెస్ కొట్టాడు. సంక్రాంతికి `వినయ విధేయ రామ`తో మరో సక్సెస్ కొట్టబోతున్నాడు. అలాగే రాజమౌళితో `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. అలాగే దానయ్య నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను కూడా ఓ సినిమా చేయబోతున్నా. ఇద సెట్ చేసింది కూడా రామ్ చరణే. త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్నది నా కోరిక. ఎంతో ఉత్సాహంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా`` అన్నారు.