చిరు దర్శనం... స్వర్గమే...
on Nov 26, 2018
మెగాస్టార్ చిరంజీవి దర్శనంతో పల్లె కోయిలమ్మ బేబీ పరవశించిపోయింది. స్వర్గంలో వున్నట్టుందని అమితానందంతో ఉప్పొంగింది. చిరంజీవి కాళ్ల మీద పడి తాను ఈ క్షణం చచ్చిపోతే చాలనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల సోషల్ మీడియాలో పల్లె కోయిలమ్మ బేబీ పాడిన 'ఓ చెలియా.. నా చెలియా' పాట బాగా వైరల్ అయ్యింది. భారతీయ చిత్ర పరిశ్రమలో పలువురు ఆమెకు అభిమానులు అయ్యారు. అందులో చిరంజీవి సతీమణి సురేఖ, చిరంజీవి కూడా వున్నారు. ఎలాగైనా ఆమెను కలవాలని సురేఖ కోరారు. మెగా ఫ్యామిలీ కోరిక తెలుసుకున్న సంగీత దర్శకుడు కోటి... బేబీని మెగా ఇంటికి తీసుకువెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి దర్శనంతో బేబీ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ క్షణం తాను స్వర్గంలో వున్నట్టుందని, మరణించినా పర్వాలేదని బేబీ వ్యాఖ్యానించారు. సంగీత దర్శకుడు రెహమాన్ కూడా ఆమెను చెన్నై తీసుకు రమ్మని చెప్పారనీ, ఆమెతో ఓ పాట పాడిస్తానని అన్నారనీ కోటి తెలిపారు. ఇప్పటికే తెలుగులో ఆమె చేత సంగీత దర్శకుడు రఘు కుంచె ఓ పాట పాడించారు.