యుద్ధ విజేత రౌద్ర రామ!
on Nov 9, 2018
ప్రతి సినిమా కథలోనూ చివరకు కథానాయకుణ్ణి విజయం వరిస్తుంది. స్టార్ హీరోల మాస్ కమర్షియల్ సినిమాల్లో అయితే కథానాయకుడు ప్రతినాయకులపై యుద్ధం చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు. స్టార్ హీరోల మాస్ కమర్షియల్ సినిమాల్లోనూ దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలు ప్రత్యేకం! ఆయన కథానాయకుడు చేసే యుద్ధాలు భీభత్సంగా వుంటాయి. యుద్ధంలో రక్తం ఏరులై పారుతుంది. అటువంటి యుద్ధాలకు రామ్ చరణ్ కథానాయకుడిగా తన దర్శకత్వంలో రూపొందుతోన్న 'వినయ విధేయ రామ' సినిమాలో ఏమాత్రం లోటు లేదని ఫస్ట్లుక్తోనే బోయపాటి సూచనలు ఇచ్చేశారు. దానికి కొనసాగింపు అన్నట్టుంది ఈ రోజు విడుదలైన టీజర్. ఇందులో రామ్ చరణ్ లుక్కులో కొత్తదనం ఏమీ లేదు. 'రచ్చ', 'నాయక్' సినిమాల్లో చూసినట్టే వుంది. కానీ, మాస్ ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అంశాలకు ఏమాత్రం లోటు వుండదని టీజర్ స్పష్టం చేసింది.
"భయపెట్టాలంటే పది నిముషాలు... చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే... సెలెక్ట్ చేసుకో" అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. దానికంటే ముఖ్యంగా "పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్.. రామ్ కొణిదెల" అనే డైలాగ్ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్నదమ్ముల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో, అన్నయ్యలకు హీరో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనేది డైలాగ్ రూపంలో చెప్పించారు. "అన్నయ్య... వీణ్ణి చంపేయాలా? భయపెట్టాలా?" అని. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతంలో "ధైర్య వినాశ రామ... విఘ్న విజేత రామ.. వినయ విధేయ రామ" అంటూ పాట పెట్టించి జస్టిఫికేషన్ ఇచ్చారు. బోయపాటి సినిమాల్లో కనిపించే భారీతనం, భారీ కాస్టింగ్ టీజర్లో కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్, రామ్ చరణ్ అన్నయ్యలుగా నటించిన ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ టీజర్లో కనిపించారు. కానీ, కథానాయిక కియారా అద్వానీ మాత్రం కనిపించలేదు. డివివి దానయ్య భారీగా ఖర్చు పెట్టారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద మరో బోయపాటి మార్క్ మాస్ కమర్షియల్ సినిమా వస్తుందన్నమాట!