‘సైరా’... పతాక యుద్ధం ముగిసింది!
on Oct 20, 2018
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలియాస్ మెగాస్టార్ చిరంజీవి మూడు రోజుల క్రితమే జార్జియా నుంచి వచ్చేశారు. అందరూ 25 రోజుల నుంచి అక్కడ చేస్తున్న యుద్ధం ముగిసిందని అనుకున్నారు. కానీ, అసలు యుద్ధం ఈ రోజు ముగిసింది. చిరంజీవి లేని వార్ ఎపిసోడ్స్ ఈ రోజు వరకూ తెరకెక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం గత నెలాఖరున జార్జియా వెళ్ళారు. గతంలో ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాల్లో యుద్ధ సన్నివేశాలను క్రిష్ జార్జియాలోనే తెరకెక్కించారు. అక్కడే సురేందర్రెడ్డి ‘సైరా’ పతాక సన్నివేశాలను తెరకెక్కించారు. శనివారంతో జార్జియాలో తీయాలని ప్లాన్ చేసిన యుద్ధం మొత్తం పూర్తయ్యింది. మూడు రోజుల క్రితమే చిరంజీవి నటించాల్సిన సన్నివేశాలు పూర్తి కావడంతో ఆయన ఇండియాకు బయలుదేరారని సమాచారం. చిత్రబృందం రెండు మూడు రోజుల్లో రానుంది. ‘బాహుబలి’లో యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫీ చేసిన లీ విట్టేకర్ ‘సైరా...’లో యుద్ధ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు.
Also Read