పవన్కల్యాణ్ని చాలాసార్లు అడిగా!
on Oct 19, 2018
లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర కార్యక్రమం 'మేము సైతం'. కష్టాల్లో వున్న ప్రజలకు సహాయం చేయడం, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించడం ఈ కార్యక్రమం వెనుక వున్న ఉద్దేశం. ప్రస్తుతానికి 'మేము సైతం' కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేనని లక్ష్మీ మంచు తెలిపారు. అయితే... సీజన్ ప్రారంభానికి ముందే ఆమెకు ప్రేక్షకుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. 'మీ కార్యక్రమానికి పవన్కల్యాణ్ అతిథిగా వస్తే చూడాలని వుంది మేడమ్. ఇది సాధ్యమేనా?' అని!
తెలుగు చలచిత్ర పరిశ్రమలోని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. నాని, అనుష్క, రకుల్, జయసుధ, నాగశౌర్య తదితర యంగ్ స్టార్స్తో పాటు మోహన్ బాబు, బాలకృష్ణ వంటి సూపర్ స్టార్స్ వచ్చారు. పవన్కల్యాణ్ రాలేదు. ప్రేక్షకులు అదే ప్రశ్న అడగటంతో లక్ష్మీ మంచు సమాధానం చెప్పారు. "చాలాసార్లు పవన్కల్యాణ్గారిని అడిగి చూశా. ఇప్పటివరకూ ఆయన నుంచి సమాధానం రాలేదు" అని ట్విట్టర్లో ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 'మేము సైతం' కార్యక్రమానికి పవన్కల్యాణ్ని అతిథిగా తీసుకురావాలని లక్ష్మీ మంచు ప్రయత్నించారన్న మాట! కానీ, ఆయనే ఏ సంగతీ చెప్పలేదు.