ఈ నలుగురి కెరీర్ ముగిసినట్లేనా..?
on Feb 23, 2018
మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల పండగ కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు.. వీరిలో ఓట్లు వేయడం కోసం వెయిట్ చేసే వారు కొందరైతే.. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడే వారు మరికొందరు. ఇలాంటి వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. దీనిలో భాగంగా దక్షిణాదిలోని నలుగురు సూపర్స్టార్లు రాజకీయ రణరంగంలోకి దూకారు. వీరిలో టాలీవుడ్ నుంచి పవర్స్టార్ పవన్కళ్యాణ్, కోలీవుడ్ నుంచి రజనీ, కమల్ హాసన్, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు.
ఇప్పటికే ఫేంలో ఉన్న పార్టీల నుంచి కాకుండా.. కొత్త సిద్దాంతాలు, ఆశయాలతో వీరు నలుగురు రంగంలోకి దిగారు. చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసి.. ఇక తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తామని నలుగురు సూపర్స్టార్లు ప్రకటించారు. ఈ నలుగురిలో పవన్కళ్యాణ్కు రాజకీయాలతో ముందు నుంచి అనుబంధం ఉంది. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి పవన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు సొంతంగా "జనసేన"ను స్థాపించి.. దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక "మక్కల్ నీతి మయ్యం"ని కమల్.. "ప్రజ్ఞావంత జనతా పక్ష"ని ఉపేంద్ర ప్రకటించారు.. అయితే తన పార్టీ పేరును.. సిద్ధాంతాలను సూపర్స్టార్ రజనీ ప్రకటించాల్సి ఉంది.
రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో కానీ.. వీరి పోలిటికల్ ఎంట్రీని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల పాటు తమ మార్క్ యాక్టింగ్తో ప్రేక్షకులను వీరు నలుగురు ఎంటర్టైన్ చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు.. సినిమాల్లో నటించడం కుదరదు కాబట్టి.. వీరి నుంచి వినోదంతో పాటు సినీ పరిశ్రమకు కూడా ఇది పెద్దదెబ్బే అంటున్నారు క్రిటిక్స్.